సాధారణంగా చెరువులు, వాగుల్లో పెరిగే చేపలు రెండు, మూడు కిలోల నుంచి ఐదు, పది కిలోల వరకు బరువు పెరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇంకాస్త పెద్ద చేపలు వలల్లో పడుతుంటాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు సమీపంలో ప్రవహించే మున్నేరు వాగులో భారీ చేప దొరికింది. అది ఏకంగా 22 కేజీల బరువు ఉండటంతో అందరూ నోరెళ్లబెట్టారు. వలలో పడిన ఆ బొచ్చె చేపను ఒడ్డుకు తీసుకురావడానికి ఆ మత్స్యకారుడు నానా తిప్పలు పడ్డాడు.
పెనుగంచిప్రోలు వద్ద మున్నేరు వాగులో నిత్యం మత్స్యకారులు చేపలు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఓ మత్స్యకారులు వల తీసుకుని చేపల వేటకు వెళ్లాడు. కాసేపటికి వల బరువెక్కుతూ అతడిలోనే లోపలికి లాగేసినట్లు అనిపించింది. దీంతో అప్రమత్తమైన అతడు ఆ వలను జాగ్రత్తగా పైకి లాగగా భారీ బొచ్చె చేప గిలగిలకొట్టుకుంటూ కనిపించింది. దాన్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్న అతడు ఒడ్డుకు తీసుకురాగా అక్కడున్న వారంగా నోరెళ్లబెట్టారు..
తన వలలో 22 కిలోల బరువున్న బొచ్చె చేప పడటంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. గతంలో మున్నేరులో 15 కిలోల చేప వలకు చిక్కిందని.. 20 కిలోలకు పైగా బరువున్న చేప దొరకడం ఇదే తొలిసారని జాలర్లు చెబుతున్నారు. ఈ విషయం చుట్టుపక్కల తెలియడంతో ఆ భారీ చేపను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చి దానితో ఫోటోలు దిగారు. ఆ చేపను అదే గ్రామానికి చెందిన యువకులు రూ.4500కి కొనుగోలు చేసి వాటాలు వేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa