ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసాకు మరో అవకాశం....ఇంకా దరఖాస్తూ చేసుకోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2023, 02:37 PM

ఏపీలో రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హత కలిగి వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందని అన్నదాతలకు అండగా నిలిచింది. వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందని రైతు ఒక్కరు కూడా ఉండకూడదని భావిస్తోంది. ఇప్పటికీ పెట్టుబడి సాయం దక్కని భూ యజమానులను గుర్తించి, వారి వివరాలను నమోదు చేసేందుకు అవకాశం కల్పించింది. ఆర్బీకే సిబ్బంది ద్వారా రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారిలో అర్హులకు అక్టోబర్‌లో రెండు విడతల సాయం కలిపి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.


ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు సంతృప్తికర స్థాయిలో అర్హత ఉన్న వారికి పెట్టుబడి సాయం అందించే సంకల్పంతో రైతు భరోసా పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించామన్నారు వ్యవసాయ శాఖ స్పెషల్‌ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. మ్యుటేషన్‌ చేయించుకున్న వారు, కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారు, వారసత్వ హక్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తమ పరిధిలోని ఆర్బీకే సిబ్బందిని సంప్రదించి వివరాలను నమోదు చేయించుకోవాలని సూచించారు. అలాగే ఇప్పటి వరకు లాక్‌ అయిన ఈ పోర్టల్‌ లాగిన్‌ను ఈ నెల 12నుంచి కొత్త రిజిస్ట్రేషన్స్‌ కోసం తెరిచారు. ఇంకా అర్హత ఉండి అవకాశం వినియోగించుకోని మిగిలిన రైతులతో పాటు కొత్తగా చేరిన రైతు కుటుంబాలు ఈ పథకంలో అర్హత సాధించటానికి ప్రస్తుతం భూ యజమాని రైతులకు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించింది. నమోదు చేసుకున్న వారిలో అన్ని అర్హతలు కల్గిన భూ యజమానులకు అక్టోబర్‌లో రెండు విడతల సాయం అందిస్తారు.


ఈ నాలుగేళ్లలో రైతు భరోసా కింది ఇప్పటివరకు 52,57,263 రైతు కుటుంబాలకు రూ.31 వేల కోట్ల పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఏటా తొలి విడత సాయం పంపిణీ సమయంలోనే రైతు భరోసా పోర్టల్‌ లాగిన్‌ను తెరుస్తుంటారు. ఆ సమయంలో చనిపోయిన వారి వివరాలను తొలగించడంతో పాటు ఆ ఏడాది అర్హత పొందిన భూ యజమానుల వివరాలను నమోదు చేసి పెట్టుబడి సాయం అందిస్తారు. ఈ నాలుగేళ్లలో 5,07,935 మంది అదనంగా భూ యజమానులు అర్హత పొందారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా అన్ని అర్హతలు ఉండి ఈ పథకం కింద లబ్ధి పొందలేకపోయిన వారికి మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ పొందిన వారు, తల్లిదండ్రులు మృతిచెందగా వారసత్వంగా భూములు పొందినవారు, అన్నదమ్ములు వాటాల కింద భూములు పంచుకున్న వారు, వివిధ రూపాల్లో మ్యుటేషన్‌ పొందిన వారు తమ వివరాలను రైతు భరోసా పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అవసరమైన వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa