దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను సోమవారం నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జరిగే ప్రత్యేక భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశాల్లో మోదీ సర్కారు ఏదైనా అనూహ్య నిర్ణయం ప్రకటిస్తుందా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఎజెండాను ప్రభుత్వం ప్రకటించినా అంతకు మించి ఏదో ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రత్యేక సమావేశాలను కేంద్రం ఎందుకు నిర్వహిస్తోంది? అనేది అత్యంత ఆసక్తిగా మారింది.
సెప్టెంబరు 18 నుంచి 22 వరకూ ఐదు రోజుల పాటు ప్రత్యే సమావేశాలు నిర్వహిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది. తొలుత ఎజెండాను ప్రకటించకపోవడంతో స్వయంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రధానికి లేఖ రాశారు. దీంతో గత బుధవారం తాత్కాలిక ఎజెండాను ప్రకటించింది. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొంది. వీటిని ప్రతిపక్షాలు నమ్మడం లేదు. చివరి నిమిషంలో ఏవో బాంబులను పేల్చే అవకాశముందని అంటోంది.
అంతేకాదు, గతంలో సమావేశాలకు కొన్ని రోజుల ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎజెండాను వివరించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి 18న సమావేశాలుంటే 17నే అఖిల పక్షాన్ని కేంద్రం ఏర్పాటు చేయడం గమనార్హం.సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన తర్వాత లోక్సభలో ప్రధాని మోదీ.. రాజ్యసభలో బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయల్ చర్చను ప్రారంభించే అవకాశం ఉంది. మర్నాడు మంగళవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్లో హాల్లో రాజ్యసభ, లోక్సభ సభ్యులు సమావేశమై భారత పార్లమెంటు వారసత్వాన్ని స్మరించుకుని.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పం తీసుకుంటారు. అనంతర ఫోటో సెషన్ ఉంటుంది. ఇది ముగిసిన అనంతరం నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభమవుతాయి. దీనికి ముందు వినాయకచవితి నేపథ్యంలో గణేశ్ పూజను నిర్వహిస్తారు.
తర్వాత అడ్వకేట్స్ సవరణ బిల్లు-2023, ది ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, పోస్టాఫీసుల బిల్లు 2023, ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్ల (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు 2023, వివిధ నిరర్ధక చట్టాల రద్దుకు సంబంధించిన ‘ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు-2023’లను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఇక, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓమ్ బిర్లా కూడా పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా దూరంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa