ఏపీలోని అన్నమయ్య జిల్లా రాజంపేటలో వినాయక నిమజ్జన వేడుకలో తీవ్ర విషాదం నెలకొంది. నిమజ్జననానికి వెళ్తున్న క్రమంలో నిర్వహించిన గణేషుని శోభాయాత్రలో ఓ యువకుడు క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల మూడు రోజులకు, మరికొన్ని చోట్లు ఐదు రోజులకు గణేషున్ని గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తున్నారు. కాగా.. రాజంపేట గ్రామంలో కొందరు యువకులు కలిసి వినాయకున్ని పెట్టారు. ఐదు రోజులుగా వైభవంగా పూజలు నిర్వహించారు. అయితే.. ఐదు రోజులు కావటంతో గణేషున్ని నిమజ్జం చేసేందుకు సిద్ధం చేశారు. అందులో భాగంగానే.. ఓ ట్రాక్టర్లో గణపయ్య విగ్రహాన్ని పెట్టి.. అలంకరించారు. నిమజ్జనానికి వెళ్తున్న క్రమంలో బ్యాండ్ చప్పుళ్లకు.. గణపయ్య ముందు యువకుల ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తున్నారు.
పాత బస్టాండ్ సర్కిల్కు చేరుకోగా.. ఓ యువకుడు మరింత ఉత్సాహానికి లోనయ్యాడు. అప్పటివరకు బ్యాండ్ చప్పుడుకు అనుగుణంగా డ్యాన్స్ చేసిన యువకుడు.. కొంచె వెరైటీగా డ్యాన్స్ చేద్దామనుకున్నాడో.. లేదా తనలో ఉన్న టాలెంట్ను చూపిద్దామనుకున్నాడో.. ట్రాక్టర్ ఇంజిన్ ఎక్కి పల్టీ కొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ.. ఊహించని రీతిలో ఆ పల్టీ మిస్ ఫైర్ అయి ఆ యువకుడు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. ఆ యువకుడు బరువు ఎక్కువగా ఉండటంతో.. పల్టీ కొడుతున్న సమయంలో ల్యాండింగ్ సరిగ్గా కాకపోవటంతో.. తల రోడ్డుకు బలంగా కొట్టుకుంది. దీంతో.. ఆ వ్యక్తి జీవచ్చవంలా పడిపోయాడు.
తోటి యువకులంతా వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. యువకుడి బరువంతా తలపైనే పడటంతో.. తలలోని నరాలు పగిలిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో.. కంటిరెప్ప వేసినంత సేపట్లోనే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ.. వినాయకున్ని నిమజ్జనానికి తీసుకెళ్తున్న యువకుడు ఊహించని విధంగా ప్రాణాలు కోల్పోవటంతో.. ఆ యువకుడి కుటుంబంతో పాటు గ్రామమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.
దేశమంతా వినాయక నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో.. యువకులు ఉత్సాహంతో రకరకాల డ్యాన్సులు చేస్తుంటారు. అయితే.. అత్యుత్సాహానికి లోనై... కొందరు ఇలాంటి స్టంట్లు చేస్తుంటారు. కాగా.. ఇలాంటివి చేయకపోవటమే మంచిది. ఒకవేళ చేసినా.. తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే.. ప్రాణాలు చాలా విలువైనవి. వాటిని మన అత్యుత్సాహంతో క్షణాల్లో చేజార్చుకుంటే.. మళ్లీ తిరిగి రావన్న విషయాన్ని యువత గుర్తుపెట్టుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa