పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా, ఛత్తీస్గడ్ మీదుగా తెలంగాణ వరకు.. ఛత్తీస్గడ్ నుంచి మహారాష్ట్ర మీదుగా కొంకణ్ తీరం వరకు వేర్వేరు ద్రోణులు విస్తరించాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాలో అనేకచోట్ల, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల సోమవారం వర్షాలు కురిశాయి.
ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, బాపట్ల జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా, ప్రకాశం జిల్లా, విజయనగరం జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, తిరుపతి జిల్లా, కడప జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంటున్నారు. అంతేకాదు పిడుగులతో కూడిన వర్షాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
చిత్తూరు జిల్లా శాంతిపురంలో 82.4, కడప జిల్లా సింహాద్రిపురంలో 70.2, కడప జిల్లా వల్లూరులో 68.4, చిత్తూరు జిల్లా పుంగనూరులో 65.2, విజయనగరం జిల్లా ఎస్ కోటలో 66.2 మిల్లీ మీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరులో 58.8, కడప జిల్లా కమలాపురంలో 55.2, చిత్తూరు జిల్లా కుప్పంలో 52, తిరుపతి జిల్లా పాకాలలో 51.2, శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవచెరువులో 46.4, కాకినాడ జిల్లా పెద్దాపురంలో 45.4, కృష్ణా జిల్లా మసులిపట్నంలో 45.2, అనంతపురం జిల్లా శింగనమలలో 44.4, అనంతపురం జిల్లా ఉరవకొండలో 42.6, కడప జిల్లా వేంపల్లెలో 41.8, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో 41.2, శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడలో 41.2, చిత్తూరులో 41, అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెలో 40, శ్రీ సత్యసాయి జిల్లా తాడిమర్రిలో 38.8, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 38, నంద్యా జిల్లా రుద్రవరంలో 37.8, శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లులో 36.8, పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 36, కడప జిల్లా పులివెందులలో 35.6, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 35, బాపట్లలో 33.8, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 30.4, చిత్తూరు జిల్లా నగరిలో 30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
మరోవైపు నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైంది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల నుండి ఈ రోజు (25 సెప్టెంబర్, 2023) ఉపసంహరణ మొదలైంది. అక్టోబర్ 15 నుంచి 20 మధ్యలో ఈ నిష్క్రమణ ప్రక్రియ పూర్తికానుంది. వాస్తవానికి సెప్టెంబరు 17 నుంచి రుతుపవనాల ఉపసంహరణ మొదలుకావాలి. కానీ ఈ ఏడాది ఆలస్యమైంది. ప్రస్తుతం రాజస్థాన్లో పొడి వాతావరణం నెలకొనడం, గడచిన ఐదు రోజుల నుంచి వర్షాలు లేకపోవడంతో నిష్క్రమణపై సోమవారం వాతావరణ శాఖ ప్రకటన చేసింది. ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన కేరళలో ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా ఎనిమిదో తేదీన వచ్చిన సంగతి తెలిసిందే. ఎల్నినో ప్రభావంతో జూన్, ఆగస్టు నెలల్లో వర్షాభావం నెలకొంది. జూలైలో మాత్రం దేశవ్యాప్తంగా వర్షపాతం నమోదైంది. ఆగస్టులో వందేళ్ల కాలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే సెప్టెంబరులో కొంతమేర వాతావరణ పరిస్థితులు అనుకూలించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa