దశాబ్దాలుగా కావేరీ జలాలకు సంబంధించి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదం ప్రస్తుతం మరోసారి తెరపైకి వచ్చింది. కావేరీ జలాల కోసం రెండు రాష్ట్రాల అన్నదాతలు రోడ్డెక్కుతుండటంతో పరిస్థితి చిలికి చిలికి గాలివాన లాగా తయారవుతోంది. అయితే కావేరీ నదీ జలాల నుంచి తమిళనాడుకు సెప్టెంబరు 13 వ తేదీ నుంచి 15 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ- సీడబ్ల్యుఎంఏ ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిపై కర్ణాటక రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ ఉత్తర్వులను అడ్డుకోవాలని కర్ణాటక సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అక్కడ సిద్ధరామయ్య సర్కార్కు చుక్కెదురైంది. నీటి విడుదలపై కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. ఈ నేపథ్యంలోనే తమకు తాగు, సాగు నీటి అవసరాలు ఉండటంతో నీటిని విడుదల చేసే పరిస్థితి లేదని కర్ణాటక ప్రభుత్వం చెప్పింది.
ఈ నేపథ్యంలోనే తమిళనాడు రైతులు తాజాగా సరికొత్తగా నిరసనలు చేపట్టారు. తిరుచ్చిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్థ నగ్నంగా ఉండి.. నోట్లో చనిపోయిన ఎలుకలను పెట్టుకుని ఆందోళన చేశారు. కావేరీ జలాలు విడుదల చేయకపోతే ఎడారిగా మారే తమ ప్రాంతంలో ఎలుకలు తిని బతకాలా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు.. తమిళనాడుకు నీటి విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా కర్ణాటకలోనూ తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని బెంగళూరులో రైతు సంఘాలు మంగళవారం బంద్ నిర్వహించాయి.
బెంగళూరు బంద్ నేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి వరకు నగరం మొత్తం పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇక బెంగళూరులోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. బెంగళూరు బంద్ కారణంగా మంగళవారం నగరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. అయితే బెంగళూరు మెట్రో సేవలు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నాయి.
ఈసారి కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ప్రభావంతో జులై నుంచి ఆగస్టు చివరి వరకు 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో కావేరి జలాశయాల్లో నీరు తగ్గిపోవడంతో తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక స్పష్టం చేసింది. కానీ అటు తమిళనాడు మాత్రం.. కావేరి నుంచి తమ వాటాగా 12 వేల క్యూసెక్కుల నీరు ఇవ్వాలని కోరింది. రెండు రాష్ట్రాల పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని కర్ణాటకకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కర్ణాటకకు ఎదురుదెబ్బ తగిలింది. తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa