ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ నుంచి వారణాసి (కాశీ)కి రైలు, త్వరలో ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 09:52 PM

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై విశాఖపట్నం నుంచి నేరుగా కాశీ (వారణాసి)కి వెళ్లవచ్చు. సంబల్‌పూర్‌ నుంచి బనారస్‌ మధ్య నడిచే (18311) ఎక్స్‌ప్రెస్‌ రైలును విశాఖపట్నం వరకూ పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) సోమవారం (సెప్టెంబర్ 25) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఉత్తరాంధ్ర వాసులు వారణాసికి వెళ్లాలంటే.. ఇప్పటివరకూ అటు భువనేశ్వర్ గానీ, ఇటు విజయవాడ గానీ వస్తున్నారు. వారణాసికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును విశాఖపట్నం వరకూ పొడిగించాలని కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఈ అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్తావించారు.


ఈ రైలు ద్వారా కాశీతో పాటు ప్రధాన రైల్వే జంక్షన్లైన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్, హాతియా, రాంచీ, రూర్కెలా, ఝార్సుగూడ, సంబల్‌పూర్ చేరుకోవచ్చు. ఉత్తరాంధ్రతో పాటు ఒడిశాలోని పలు ప్రాంతాల ప్రజలకు ఇది ప్రయోజనకరం. డబ్బు ఆదా అవ్వడంతో పాటు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ప్రస్తుతం ఈ రైలు ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి వారణాసికి వారానికి రెండు రోజులు (బుధ, శని) మాత్రమే రాకపోకలు సాగిస్తోంది. దీన్ని రోజూ అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ కూడా ఉంది. విశాఖపట్నంతో పాటు ఒడిశాలోని బాలంగీర్, బార్గా, కలహండి, రాయగడ ప్రజలు ఈ రైలును పొడిగించాలని, రోజూ అందుబాటులోకి తీసుకురావాలని కోరారని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తాను ఆయా ప్రాంతాలకు పర్యటనలకు వెళ్లినప్పుడు అధికారులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని ఆయన వెల్లడించారు.


ఈ రైలు విశాఖపట్నం నుంచి త్వరలోనే అందుబాటులోకి రానుంది. విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఏపీలోని కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి, ఒడిశాలోని సంబల్‌పూర్‌ స్టేషన్ల మీదుగా వారణాసి చేరుకుంటుంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిని గడిచిన కొన్నేళ్లలో పర్యాటకంగా అద్భుతంగా అభివృద్ధి చేశారు. కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. కాశీకి దేశ విదేశాల నుంచి ఇప్పటికే వేలాది మంది పర్యాటకులు వస్తుండగా.. ఈ ఏడాది ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో అత్యధిక మంది సందర్శకులు వస్తున్న ప్రదేశంగా వారణాసి నిలిచింది.


కాశీ విశ్వనాథుడిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తారు. అక్కడి గంగా నదిలో పవిత్ర స్నానం చేసి తన్మయత్వం పొందుతారు. అంతేకాకుండా, ఎక్కువ మంది హిందువులు కర్మకాండలకు సంబంధించిన క్రతువులను నిర్వహించేందుకు కాశీకి వెళ్తుంటారు. ఇప్పటిదాకా నేరుగా రైలు సదుపాయం లేకపోవడంతో ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి వారణాసి చేరుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంబల్‌పూర్ - వారణాసి రైలును విశాఖపట్నం వరకూ పొడిగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయం పట్ల ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేర్చినందుకు రైల్వే శాఖకు ధన్యవాదాలు అంటూ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఓ వీడియోను షేర్ చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa