ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇక నుంచి గేర్ మార్చాలని,,,పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేసిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 26, 2023, 09:56 PM

వచ్చే ఎన్నికల కోసం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఓ లెక్క అన్నట్టుగా వ్యూహాలకు పదును పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు గానూ 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని మరోసారి పార్టీ నేతలకు సీఎం జగన్ సూచించారు. 175 సీట్లు గెలవడం అసాధ్యమేమీ కాదని.. కొంచెం కష్టపడితే గెలవొచ్చని ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు.


ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు అని నేతలకు జగన్ సూచించారు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యమని.. గేర్‌ మార్చాల్సిన సమయం వచ్చేసిందని దిశానిర్దేశం చేశారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇక నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని జగన్ సూచించారు.


మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమేనన్న జగన్.. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలని సూచించారు. టికెట్ల విషయంలో తన నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని జగన్ కోరారు. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చన్న జగన్.. టికెట్లు ఇవ్వనంత మాత్రాన నిరాశ చెందొద్దని తెలిపారు. టికెట్లు రాని వారికి.. మరో అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. టికెట్‌ ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరని తెలిపారు. నాయకునితో పాటు పార్టీ మీద నమ్మకం ఉండాలన్నారు. చివరి దశ సర్వేలు జరుగుతాయని.. వాటి ప్రకారం ప్రజల్లో ఎవరికి మంచి అభిప్రాయం ఉంటే వాళ్లకే టికెట్లు వస్తాయన్నారు. అందరూ ప్రజలతో మమేకం కావాలన్నారు జగన్.


మరోవైపు.. రానున్న రోజుల్లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్‌ జగన్‌ అనే కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సీఎం ప్రకటించారు. జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల ప్రజల్లో మంచి ఆదరణ వచ్చిందన్న జగన్.. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు. కాగా.. ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నామని తెలిపారు. ఆరోగ్యపరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతామని.. ఉచితంగా పరీక్షలు చేయటమే కాకుండా.. మందులు కూడా ఇస్తామన్నారు. అవసరమమైన వారికి మెరుగైన చికిత్సలు కూడా అందిస్తామన్నారు. విలేజ్‌ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌తో చేయూతనిస్తామన్నారు.


ఈ కార్యక్రమాన్ని మొత్తం 5 దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారని చెప్పుకొచ్చారు. ఇక.. రెండో దశలో ఏఎన్‌ఎంలు, సీహెచ్‌ఓలు, ఆశా వర్కర్లు ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేస్తారన్నారు. మూడో దశలో.. వాలంటీర్లు, గృహ సారథులు ప్రజా ప్రతినిధులు క్యాంపు వివరాలు తెలియజేస్తారని తెలిపారు. నాలుగో దశలో గ్రామాల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక.. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి నయం అయ్యే వరకు మెరుగైనా చికిత్సలు అందిస్తామని సీఎం వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa