స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)పై సుప్రీం కోర్టులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. బుధవారం ఈ పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ముందుకు రాగా.. న్యాయమూర్తులు విచారణకు విముఖత చూపారు. ఈ పిటిషన్పై నాట్ బి ఫోర్ మీ అని ధర్మాసనంలోని జస్టిస్ భట్టి వ్యాఖ్యానించడంతో మరో బెంచ్కు బదిలీ చేశారు. అయితే, ఈ విషయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. సీజేఐ ధర్మాసనం ముందు చంద్రబాబు పిటిషన్ను ఆయన తరఫున లాయర్లు మెన్షన్ చేసే ప్రయత్నాలు ఫలించాయి.
సీజేఐ ధర్మాసనం ఈ పిటిషన్పై వాదనలు వినడానికి సమ్మతించింది. ఈ సందర్భంగా మీకేం కావాలని చంద్రబాబు తరుఫున లాయర్ సిద్ధార్థ లూథ్రాను సీజేఐ ధర్మాసనం ప్రశ్నించింది. లూథ్రా వాదనలు వినిపిస్తూ.. కేసు ఈ రోజు లిస్టయినా విచారణకు జరగలేదన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్దమని వాదించారు. 17ఏను అనుసరించలేదని తెలిపారు. ఈ సమయంలో సీఐడీ తరఫున లాయర్ రంజిత్.. 17 ఏ సవరణ చేయకముందు ఈ కుంభకోణం జరిగిందన్నారు. అనంతరం మరో బెంచ్కు కేసును బదిలీచేస్తామని తెలిపిన సీజేఐ.. విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. అక్టోబరు 3న అన్ని విషయాలను వింటామని స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టుకు రేపటి నుంచి వారం సెలవుల నేపథ్యంలో మంగళవారానికి వాయిదా వేశారు. మిలాద్ ఉన్ నబీ, గాంధీ జయంతి నేపథ్యంలో అక్టోబరు 2 వరకూ సెలవులు ఉన్నాయి. దీంతో మంగళవారమే చంద్రబాబు పిటిషన్పై విచారణ జరగనుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ వాయిదా పడటంతో పిటిషన్పై కోర్టు నిర్ణయం వెలువడే వరకు చంద్రబాబు జైల్లో ఉండాల్సిందే. అంతేకాదు, ఆయన రిమాండ్ను కూడా ఏసీబీ కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది.
కాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటీషన్పై హైకోర్టు తీర్పును చంద్రబాబు తరఫున లాయర్లు సవాల్ చేస్తూ సుప్రీంలో దాఖలు చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు. దర్యాప్తు తుది దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్ను హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంపై మినీ ట్రయల్ నిర్వహించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. సీమెన్స్కు సిఫారసులతో నిధుల విడుదల దుర్వినియోగమని, ఇది అస్పష్టమైన వ్యవహారమని పేర్కొంది. నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. దీంతో 17 (ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం కోర్టులో ఆయన తరఫు లాయర్లు దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa