పాకిస్థాన్లో పాలకులను అక్కడి సైన్యం శాసిస్తుందనేది జగమెరిగిన సత్యం. నచ్చినవారిని అందలం ఎక్కించడం.. నచ్చకపోతే దింపేయడం. ఏ రాజకీయ పార్టీ కూడా తనతో రాజీ పడకుండా మనుగడ సాగించలేనంత బలంగా పాక్ సైన్యం మారింది. ఇప్పటి వరకు దాయాది దేశంలో ఏ ప్రధాని కూడా ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేయలేదు. వాస్తవానికి పాక్ రాజకీయాల్లో ఎలాంటి మార్పు వచ్చినా అందులో సైన్యం పాత్ర అనివార్యంగా మారింది. అన్నీ తామై నడిపించే సైన్యం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి దివాలా తీసిన దేశాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నడుం బిగించింది. ఇందుకు ఆయుధం వీడి.. హలం పట్టి వ్యవసాయ రంగంలోకి దిగుతుంది.
నిక్కీ ఆసియా నివేదిక వివరాల ప్రకారం.. పంజాబ్ ప్రావిన్సుల్లోని దాదాపు 10 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పాక్ సైన్యం కౌలుకు తీసుకుని సాగు చేయనుంది. ఇందులో గోధుమలు, పత్తి, చెరకు, కూరగాయలు, పండ్లు వంటి పంటలను పండించనుంది. సాగు ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే లాభాల్లో 20 శాతం సొమ్మును వ్యవసాయ పరిశోధన, అభివృద్ధికి కేటాయించాలని నిర్ణయించింది. మిగిలిన సొమ్మును సైన్యం, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా పంచుకుంటాయి. పేదలకు ఆహార భద్రత కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు సైన్యం చెబుతోంది.
అయితే, గ్రామీణ పేదల హక్కులను సైన్యం మరింత ఉల్లంఘించబోతున్నదనే విమర్శలు కూడా వస్తున్నాయి. పౌర-సైనిక ఉమ్మడి పెట్టుబడి సంస్థ ద్వారా ఈ ఏడాది ఆరంభంలో చేపట్టిన ఆహార భద్రత కార్యక్రమంలో భాగంగా లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమిలో సాగుచేసి ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోంది. ఈ ప్రణాళికను సమర్థించిన వారు మంచి పంట దిగుబడిని సాధిస్తారని, నీటిని ఆదా చేస్తారని హామీ ఇచ్చారు. క్షీణిస్తున్న విదేశీ మారక నిల్వలు, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల మధ్య పాకిస్తాన్కు ఈ ప్రయత్నం చాలా అవసరమని అంటున్నారు.
గోధుమలు, పత్తి, చెరకు వంటి పంటలు, అలాగే కూరగాయలు, పండ్లు పండించడానికి సైన్యానికి 30 ఏళ్ల వరకు భూమిని లీజుకు ఇచ్చినట్టు పత్రాలు చూపుతున్నాయి. కానీ, దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదల హక్కులు ఉల్లంఘనకు గురవుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే శక్తివంతమైన సంస్థగా ఉన్న సైన్యం ఆహార-భద్రత పేరుతో భారీ లాభాలను ఆర్జిస్తుందని అంటున్నారు. పాక్లోని భూమిలేని 25 మిలియన్ల గ్రామీణ పేదలను మరింత దూరం చేస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పాకిస్థాన్ సైన్యం దేశంలో ఏకైకఅతిపెద్ద భూ యజమానిగా అవతరిస్తుందని విమర్శకులు పేర్కొన్నారు.
‘సైన్యం పని బాహ్య బెదిరింపుల నుంచి దేశాన్ని రక్షించడం.. ప్రజా ప్రభుత్వం కోరినప్పుడు సహాయం చేయడం... ఇంతకు మించి ఎక్కువ, తక్కువ ఏమీ లేదు’ అని రఫే అలం అనే పర్యావరణవేత్త అన్నారు. ఎప్పుడు పూర్తిస్థాయిలో పనులు ప్రారంభం సహా బ్లూప్రింట్కు సంబంధించిన అనేక వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. నిక్కీ ఆసియా పరిశీలన ప్రకారం.. చాలా భూభాగం నీటికొరత ఎదుర్కొనే చోలిస్తాన్ ఎడారిలో ఉంది. బదిలీ కోసం 110,000 ఎకరాల అదనపు భూమి పక్క జిల్లాల్లో ఉందని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా లాహోర్ హైకోర్టు గతంలో భూ బదిలీని నిలిపివేయాలని ఆదేశించింది. కానీ, జూలైలో మరొక బెంచ్ ఈ నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa