ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పాల ప్యాకెట్లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు చేశారు.ఆ పాలను కల్తీ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. 'పసిపిల్లలకిచ్చే పాలనూ వదలవా సైకో జగన్! రాష్ట్రంలో జె-బ్రాండ్ల మద్యంతో లక్షలాది మహిళల తాళిబొట్లు తెంచుతున్న సైకో జగన్ అవినీతిదాహం పరాకాష్టకు చేరింది. పాపపు సొమ్ము కోసం పసిపిల్లలు, బాలింతలకు ఇచ్చే పాలను సైతం కల్తీచేస్తూ కాలకూట విషంగా మార్చారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటివరకు టెట్రా ప్యాకుల్లో సరఫరా చేస్తున్న పాలను తాజాగా సైకో జగన్ ముఖారవిందంతో లీటరు పాలిథిన్ పౌచుల్లో సరఫరా చేస్తున్నారు. ఈనెల 3వతేదీన ప్యాక్ చేసినట్లుగా చెప్పబడుతున్న ఈ పాలప్యాకెట్లకు డిసెంబర్ 2వ తేదీవరకు ఎక్స్పైరీ డేట్ ఉన్నా.. సరఫరా చేసిన రెండురోజులుకే గ్యాస్ బాంబుల్లా ఉబ్బి పేలిపోతున్నాయి. ఇవి చూశాక రక్తం రుచిమరిగిన మృగానికి, అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జగన్ రెడ్డికి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తోంది' అన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు పాడైనట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గుంటూరు జిల్లా కొల్లిపర మండలం వల్లభాపురం, మున్నంగి, దావులూరు, కొల్లిపర తదితర గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు పాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. అయితే అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు వాటిని ఈ నెల 21 నుంచి లబ్ధిదారులకు అందజేశారు. ఆరు నెలలు నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు పంపిణీ చేశారు. కొల్లిపరలో ఉన్న ఓ అంగన్వాడీ కేంద్రం నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పాలు అందగా.. వారు ఫ్రిజుల్లో నిల్వ చేసుకున్నారు.
శుక్రవారం నాడు ఓ మహిళ ఫ్రిజ్లో నుంచి పాల ప్యాకెట్ బయటకు తీయగా.. అది ఉబ్బిపోయి ఉంది. ప్యాకెట్ను కత్తిరించే ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ప్యాకెట్లోని పాలు పైకి వచ్చాయి.. పాలు కూడా పాడైపోయినట్లు గుర్తించారు. పాల నాణ్యతగా లేవని అనుమానించిన ఆమె ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు.. పాడైపోయిన ప్యాకెట్లు తీసుకుని మంచి వాటిని అందజేశామన్నారు. కాంట్రాక్టర్ అందజేసిన అందచేసిన పాల ప్యాకెట్ల ప్యాకింగ్ భిన్నంగా ఉంది అన్నారు. రిఫ్రిజిరేటర్లో పెట్టడం, రీఫిల్ ప్యాకింగ్ పాలు కావడం వల్ల పాడయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ప్యాకెట్లపై గడువు డిసెంబరు 23 వరకు ఉంది అన్నారు. గతంలో పాలప్యాకెట్లకు భిన్నంగా రీఫిల్ ప్యాకింగ్ చేయడంతో నాణ్యతా లోపాలు వచ్చి ఉంటాయన్నారు. ఈ ఘటనను లోకేష్ ట్వీట్లో ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa