ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్గా ప్రారంభించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రారంభమైన ఇంటింటి సర్వేకు అదనంగా శనివారం తొలి వైద్య శిబిరం ప్రారంభం కాబోతుంది. మొత్తంగా 5 దశల్లో జరిగే ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సీహెచ్ఓలు, ఇతర సిబ్బంది చురుగ్గా వ్యవహరించాలి అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఉచిత చికిత్సలు, అనుబంధ ఆసుపత్రుల వివరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి అన్నారు.
అనారోగ్యంతో బాధపడేవారిని గుర్తించి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటుమన్నారు సీఎం. ఇంటింటి సర్వే ద్వారా ప్రతి కుటుంబంలోని సభ్యులందరికీ ఇళ్ల వద్దనే ఏడు రకాల పరీక్షలు నిర్వహించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఈ సర్వేలో గుర్తించిన వారికి గ్రామాల్లో, పట్టణ ఆరోగ్య కేంద్రాల వద్ద జరిగే వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్టు వైద్యుల ద్వారా చికిత్స అందిస్తామన్నారు.
ఆరోగ్య శ్రీ సేవలు పొందిన తర్వాత సంబంధిత పేషెంటుకు అవసరమైన మందులు అందేలా.. ఆమేరకు పర్యవేక్షణ ఉండేలా తగిన రీతిలో ఆరోగ్య సురక్ష ద్వారా మ్యాపింగ్ చేస్తామన్నారు. సమయానికి మందులు అందేలా, మళ్లీ అవసరమైన చెకప్లు చేయించేలా, అవసరమైన చికిత్స లేదా మందులు అందేలా చూస్తామన్నారు.కేన్సర్ లాంటి పేషెంట్లకు ఖరీదైన మందులు కూడా ఉచితంగా ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తామన్నారు. ఏ పేదవాడు వైద్యంకోసం ఇబ్బంది పడకూడదనే కార్యక్రమాన్ని ఇందులో చేపడుతున్నామన్నారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈ సేవలన్నీ కూడా అందుతాయన్నారు. చికిత్సలు వారికి అందడమే కాదు.. ఆ తర్వాత కూడా వారికి సేవలు అందేలా చూడాల్సిన బాధ్యత వీరందరిపైనా ఉందన్నారు ముఖ్యమంత్రి జగన్.
ప్రజలు ఏయే వ్యాధులతో బాధపడుతున్నారో తెలుసుకొని వారికి మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వలంటీర్లు, సచివాలయ వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర రుగ్మతలతో బాధపడుతున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. తదుపరి ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద శనివారం నుంచి నవంబరు 15వ తేదీ వరకు (45 రోజులపాటు) వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ శిబిరాల నిర్వహణలో వాలంటీర్లు, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు భాగస్వాములు కానున్నారు.
ఈ 45 రోజుల పాటూ ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ఇద్దరు ఫ్యామిలీ ఫిజీషియన్ వైద్యులతోపాటు మరో ఇద్దరు వైద్య నిపుణులు హాజరై రోగులకు వైద్య పరీక్షలు చేస్తారు. రోగులకు బీపీ, హెచ్బీ, ఆర్బీఎస్, యూరిన్, డెంగ్యూ, మలేరియా, ఉమ్మి వంటి ఏడు రకాల పరీక్షలు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి శిబిరంలో 112 రకాల మందులను అందుబాటులో ఉంచి పంపిణీ చేస్తారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు వస్తే.. వారిని జిల్లా స్థాయి వైద్య నిపుణుల వద్దకు పంపుతారు. ఇటువంటి రోగులకు అందుతున్న వైద్య సేవలను నిరంతరాయంగా పరిశీలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సిటిజన్ యాప్ను ప్రతి కుటుంబంలో ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసుకొనేలా అవగాహన కల్పిస్తారు. పిల్లలు, బాలింతలకు పౌష్టికాహారం తయారీపై సూచనలు, సలహాలు ఇస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa