ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజ్జర్ హత్యపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి.. కెనడాకు జైశంకర్ సవాల్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 09:14 PM

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడాల మధ్య దౌత్య పరంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనకాల భారత ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఈ వివాదం రాజుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, రెండు దేశాల మధ్య మాటల యుద్ధంతో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే కెనడా చేస్తున్న అసత్య ఆరోపణలకు సంబంధించి ఎప్పటికప్పుడు భారత్ గట్టిగా కౌంటర్ ఇస్తూనే ఉంది. ఈ క్రమంలోనే కెనడాకు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ సవాల్ విసిరారు. నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందని ఆరోపిస్తున్న కెనడా ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు.


ఈ సందర్భంగా ఉగ్రవాదం అంశంలో కెనడా ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరించడమే ప్రస్తుతం భారత్ కెనడాల మధ్య సంబంధాలు చెడిపోవడానికి కారణమని ఆరోపించారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్‌పై ఆరోపణలు చేయడం కాదని.. భారత్ పాత్ర ఉందని నిరూపించే ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని కెనడాను నిలదీశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల కోసం అమెరికా వెళ్లిన జైశంకర్‌.. తాజాగా వాషింగ్టన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కెనడా చేస్తున్న ఆరోపణలకు సంబంధించి వారి వద్ద సమాచారం ఉంటే దాన్ని పరిశీలించేందుకు భారత్ సిద్ధంగా ఉందని.. భారత్ ఏమీ తలుపులు మూసుకుని కూర్చోలేదని గట్టిగా బదులిచ్చారు. కానీ కెనడా మాత్రం ఆ ఆరోపణలకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదని జై శంకర్‌ తెలిపారు. ఈ అంశంపై ఇరు దేశాల ప్రభుత్వాలు చర్చలు జరిపి.. విభేదాలను పరిష్కరించుకోవాల్సి అవసరం ఉందని గుర్తు చేశారు.


ఉగ్రవాదం, అతివాదంపై కెనడా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో భారత్‌ చాలా కాలంగా సమస్యలు ఎదుర్కొంటోందని జై శంకర్ మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి, ఒత్తిళ్లు, ఇతర కారణాలతో కెనడా ఉగ్రవాదం పట్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. భారత్‌లో నేరాలు, దాడులకు పాల్పడిన వారు కెనడాలో ఉన్నారని వారిని అప్పగించాలని ఎన్నోసార్లు కెనడాను కోరినా ఆ దేశం పట్టనట్టు వ్యవహరించిందని ఆరోపించారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉన్నవారు కొందరు కెనడాలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనేది నిజమని జైశంకర్‌ స్పష్టం చేశారు.


ఇక కెనడాలో భారత దౌత్య కార్యాలయాలపై దాడులు జరిగాయని.. భారత ఉద్యోగులను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని జై శంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇది సాధారణ పరిస్థితిగా పరిగణించాలా.. ఇలాంటి పరిస్థితే మిగితా దేశాలకూ వస్తే వారు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పేరుతో దౌత్యవేత్తలపై బెదిరింపులు ఏ మాత్రం ఉపేక్షించేవి కావని తేల్చి చెప్పారు. ఫ్రీడం ఆఫ్ స్పీచ్ గురించి భారత్‌కు ఇతరులు నేర్పించాల్సిన అవసరం లేదని తెలిపారు. స్వేచ్ఛ పేరుతో హింస జరిగితే ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్లేని జైశంకర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa