ట్రెండింగ్
Epaper    English    தமிழ்

31 ఏళ్ల క్రితం 18 మహిళలపై రేప్ చేసిన కేసులోలో 215 మందికి శిక్ష

national |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 09:15 PM

బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్న వ్యక్తులే వారి పాలిట నరరూప రాక్షసులు అయ్యారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 18 మంది మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అయితే నిందితుల్లో అంతా పోలీసులు, అటవీ సిబ్బంది, రెవెన్యూ అధికారులు ఉండటం తీవ్ర సంచలనంగా మారింది. ఇక ఈ కేసు 1992 నాటిది కాగా.. 31 ఏళ్ల తర్వాత మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో 3 దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్న బాధితులకు న్యాయం దక్కినట్లు అయింది. దీంతో పాటు బాధితులకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. ఇక ఈ కేసు విషయాల్లోకి వెళ్తే.


1992 లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్‌ కొండ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాసాత్తి అనే చిన్న గ్రామం ఉంది. అయితే ఆ గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 1992 జూన్‌ 20 వ 155 మంది అటవీ సిబ్బంది, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూ శాఖ అధికారులు కలిపి మొత్తం 269 మంది ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీలు చేశారు. ఆ సోదాల్లో కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 90 మంది మహిళలు, 43 మంది పురుషులపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంత ప్రజలు వారిని ఏం చేసినా అడిగే వారే ఉండరు.. పైగా ఎర్రచంద్రనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారని భావించిన ఆ ప్రభుత్వ అధికారులంతా ఆ గ్రామస్థులకు నరకం చూపించారు. ఆ గ్రామంలో ఉన్న 18 మంది గిరిజన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనపై వెంటనే బాధితులు ఆరూర్‌ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో ఇలా తమకు న్యాయం జరగదని భావించిన బాధితులు ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. నిందితులందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.


అయితే సుప్రీంకోర్టు మొట్టికాయలతో కేసు నమోదు చేసినా విచారణ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 1995 ఫిబ్రవరి 24 వ తేదీన ఈ కేసును ధర్మాసనం సీబీఐకి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులు వాసాత్తి గ్రామంలో విధ్వంసం సృష్టించిన మొత్తం 269 మందిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో 2011 సెప్టెంబరు 29 వ తేదీన ధర్మపురి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అప్పటికే నిందితుల్లో కొంతమంది చనిపోవడంతో తీర్పు వెలువరించేనాటికి బతికి ఉన్న 215 మందిని దోషులుగా తేల్చి వారికి శిక్షలు విధించారు.


ఈ 215 మంది దోషుల్లో 12 మందికి పదేళ్ల జైలు, ఐదుగురికి ఏడేళ్లు, మిగిలిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించాయి. అయితే ధర్మపురి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేసిన నిందితులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వేల్‌మురుగన్‌ ఈ కేసుకు సంబంధించి సంచలన తీర్పును వెలువరించారు. ఈ కేసులో 215 మందికి జైలుశిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతోపాటు 18 మంది బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షల పరిహారం అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో రూ.5 లక్షలు నిందితులు.. మరో రూ.5 లక్షలు ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ధర్మపురి జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఇక ఒకే కేసులో ఇంతమందికి శిక్షపడడం దేశచరిత్రలో ఇదే ప్రథమం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa