ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ మణిపూర్‌లో చెలరేగుతున్న హింస,,,రంగంలోకి పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తు అధికారి

national |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 09:19 PM

మెయితీ, కుకీ తెగల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో దాదాపు 4 నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్ అగ్ని గుండంలా మండుతోంది. ఈ హింసాత్మక ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది కట్టుబట్టలతో ఇల్లూ, వాకిలి వదిలేసి ప్రభుత్వ సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఇటీవల మణిపూర్‌లో పరిస్థితులు కొంత సద్దుమణిగినట్లే కనిపించాయి. అయితే జులైలో కనిపించకుండాపోయిన మెయితీ వర్గానికి చెందిన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురైనట్లు ఫోటోలు బయటికి రావడంతో మరోసారి మణిపూర్‌లో అల్లర్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్‌లో పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు కీలక అధికారిని రంగంలోకి దింపింది.


సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేష్ బల్వాల్‌ను.. తన సొంత కేడర్‌ అయిన మణిపూర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాకేష్ బల్వాల్.. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్‌లో తాజాగా చెలరేగిన అల్లర్లను కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మణిపూర్‌లో కొనసాగుతున్న ఘర్షణలు, హింసాత్మక ఘటనలను అదుపు చేసి.. శాంతి భద్రతలను పెంచేందుకు మరింత మంది అధికారుల అవసరమని కేంద్ర హోం శాఖ ప్రతిపాదనలు చేసిన నెల రోజుల తర్వాత కేబినెట్ నియామకాల కమిటీ దీన్ని ఆమోదించింది.


మణిపూర్‌ కేడర్‌కు చెందిన రాకేష్ బల్వాల్‌ 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. మణిపుర్‌ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 2018 లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది నాలుగేళ్లపాటు పనిచేశారు. 2019 లో జమ్ము కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన భీకర ఉగ్రదాడికి సంబంధించి దర్యాప్తు చేసిన ఎన్ఐఏ టీమ్‌లో రాకేష్ బల్వాల్ కూడా ఒకరు. ఈ ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోగా ఆ కేసును రాకేశ్ బల్వాల్ దర్యాప్తు చేశారు. ఆ తర్వాత 2021 డిసెంబరులో పదోన్నతిపై అరుణాచల్ ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాల కేడర్‌కు రాకేష్ బల్వాల్ బదిలీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌ పోలీస్‌ విభాగంలో శ్రీ నగర్‌ సీనియర్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు రాకేష్ బల్వాల్‌ను తిరిగి సొంత కేడర్‌ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.


ఇక ప్రస్తుతం మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలను విధించింది. దాదాపు రాష్ట్రమంతటా AFSPA చట్టం పరిధిని విస్తరించినట్లు ప్రకటించింది. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలపై మరోసారి నిషేధం విధించింది. అక్టోబర్‌ 1 వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa