ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.44 లక్షల ఆడీ కారులో వచ్చి ఆకుకూర విక్రయం,,,సోషల్ మీడియాలో వెరైటీ రైతుపై ప్రశంసలు

national |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 09:25 PM

సాధారణంగా రైతులు తాము పండించిన పంటను మార్కెట్లకు తీసుకువచ్చి విక్రయిస్తూ ఉంటారు. పంట పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను మార్కెట్లకు తీసుకువచ్చి అమ్మడం మరో ఎత్తు. అయితే పెట్టిన పెట్టుబడికి, పంట అమ్మగా వచ్చిన రాబడికి సంబంధం లేకుండా అప్పులు, నష్టాల్లోనే అన్నదాత కూరుకుపోయిన ఘటనలు మనం రోజూ చూస్తూనే ఉన్నాం. కానీ కొందరు రైతులు మాత్రం వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ భారీగా లాభాలు పొందుతూ ఉంటారు. అయితే అందరిలోకెల్లా ఈ రైతు మాత్రం వెరీ స్పెషల్. ఎందుకంటే ఏకంగా రూ.44 లక్షల విలువ చేసే ఆడీ ఏ4 కారులో రోడ్డు పక్కన మార్కెట్‌కు వచ్చి తన పొలంలో పండించిన ఆకు కూరలను విక్రయిస్తున్నాడు. అతనే కేరళకు చెందిన సుజిత్ ఎస్పీ అనే మోడ్రన్ రైతు.


కేరళ వాసి 36 ఏళ్ల సుజిత్ ఎస్పీకి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ఎందుకంటే రోడ్డు మీద ఏర్పాటు చేసే మార్కెట్‌లో ఆకుకూరలు విక్రయించేందుకు ఖరీదైన కారులో దిగాడు. అందులో నుంచి ఒక చాపను తీసి నేలపై పరిచి.. కారులో నుంచి ఆకు కూరలను తీసి ఆ చాపలో పెట్టి అమ్ముతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. అతని ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్ పేరు కూడా వెరైటీ ఫార్మర్ అని ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల మంది చూడగా.. కామెంట్లు కూడా పెడుతున్నారు. సుజిత్ ఎస్పీ అందరిలా కాకుండా విభిన్న పద్దతుల్లో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. దీంతోపాటు ఒకే పంట కాకుండా రకరకాల పంటలు పండిస్తూ.. తన వ్యవసాయానికి టెక్నాలజీ, అత్యాధునిక పద్దతులు జోడించి లాభసాటి వ్యవసాయాన్ని చేస్తాడు. దీంతో సుజిత్ ఎస్పీకి ఎన్నో అవార్డులు కూడా వరించాయి. ఇక తన వ్యవసాయ పద్దతుల గురించి మిగితా రైతులకు కూడా సుజిత్ ఎస్పీ అవగాహన కల్పిస్తూ ఉంటాడు.


అయితే ఇంత పకడ్బందీగా వ్యవసాయం చేస్తున్న సుజిత్ ఎస్పీ.. ముందు నుంచీ వ్యవసాయం చేసేవాడు కాదు. ఈ వెరైటీ వ్యవసాయం చేయడానికి ముందు సుజిత్ ఒక క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశాడని.. అందులో లాభాలు రాకపోవడంతో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తనకు వ్యవసాయం పట్ల ఇష్టం ఉండటంతో తనకు వచ్చిన పనితో కొంత భూమిని కౌలుకు తీసుకుని పంటలు పండించడం ప్రారంభించాడు. ఆ తర్వాత వినూత్న విధానాల్లో పంటలు పండించడం, అధిక లాభాలు ఇచ్చే పంటలను ఎంచుకోవడం, వాటిని సరైన విధంగా మార్కెటింగ్ చేయడంతో వ్యవసాయంలో సక్సెస్ అయ్యాడు. అయితే ఈ రూ.44 లక్షల విలువైన ఆడీ ఏ4 కారును సుజిత్ సెకండ్ హ్యాండ్‌లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa