ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ దుర్గ గుడి ఈవో బదిలీ,,,భ్రమరాంబ స్థానంలో డిప్యూటీ కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 08:29 PM

విజయవాడ దుర్గ గుడి ఈవో భ్రమరాంబ బదిలీ అయ్యారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 15 నుంచి మొదలు కానుండగా.. ఆకస్మికంగా ఆలయ ఈవోని ప్రభుత్వం బదిలీచేయడం చర్చనీయాంశం అయ్యింది. దేవాదాయశాఖ అధికారి భ్రమరాంబను బదిలీచేసి.. ఆమె స్థానంలో రెవెన్యూశాఖకు చెందిన డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాస్‌ను నియమించారు. అలాగే నలుగురు డిప్యూటీ కలెక్టర్ల కూడా బదిలీ అయ్యారు. నలుగురికి పోస్టింగ్‌లు ఇస్తూ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.


గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ పెద్ది రోజాను కృష్ణా జిల్లా డీఆర్వోగా బదిలీచేశారు. కృష్ణా జిల్లా డీఆర్వో పి.వెంకటరమణను బాపట్ల డీఆర్వోగా బదిలీ చేశారు. సెప్టెంబరు మొదటివారంలో ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా పోస్టింగ్‌ పొందిన ఎం.శ్రీనివాస్‌.. ఆ పోస్టులో చేరలేదు. తాజాగా ఆయన్ను దుర్గగుడి ఈవోగా నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా డీఆర్వోగా ఎస్వీ నాగేశ్వరరావును నియమించారు.


దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సమయంలో ఈవో బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి కీలక సమయంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే.. అక్కడ పరిస్థితులు, ఇతర అంశాల్లో ఇబ్బందిపడతారా అనే చర్చ జరుగుతోంది. దసరా ఉత్సవాలు విజయవాడ దుర్గగుడిలోనే ఘనంగా జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తారు.. అందుకు తగినట్లుగా ప్రత్యేక ఏర్పాట్లు, సదుపాయాల కల్పన వంటి ఏర్పాట్లు పక్కాగా ఉండాలి.


భ్రమరాంబకు వరుసగా రెండుసార్లు దసరా ఉత్సవాలు నిర్వహించిన అనుభవం ఉంది.. తాజా ఉత్సవాలకూ ఆమే దగ్గరుండి ఏర్పాట్లు చేయిస్తున్నారు. ఇంతలో ఆమెను బదిలీచేసి, రెవెన్యూశాఖ అధికారిని నియమించడం చర్చనీయాంశమైంది. ఆయన బాధ్యతలు తీసుకొని.. అన్నీ తెలుసుకొనేలోపే ఉత్సవాలు మొదలవుతాయి అంటున్నారు.ఇటీవలే శ్రీశైలం ఆలయ ఈవోను కూడా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుసగా ఈవోల బదిలీ చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీ చేశారనే ఆరోపణలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa