ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గులాం నబీ ఆజాద్‌కు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ పదవి.. .. ఆ వార్తలను కొట్టిపారేసిన ఆజాద్

national |  Suryaa Desk  | Published : Mon, Oct 02, 2023, 08:56 PM

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నేత, ప్రస్తుత డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ-డీపీఏపీ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ తాజాగా తనపై వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికారు. తనను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించనున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. తనకు అలాంటి పదవులపై ఆసక్తి లేదని.. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న సమస్యలకు సంబంధించి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.


జమ్మూ కాశ్మీర్ తదుపరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తనను నియమిస్తున్నారన్న పుకార్లను గులాం నబీ ఆజాద్ ఖండించారు. తనకు అసలు లెఫ్టినెంట్ గవర్నర్ పదవిపై ఆసక్తి కూడా లేదని తెలిపారు. అయితే ఉపాధి కోసమే డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ పెట్టారని తనపై వస్తున్న విమర్శలను గులాం నబీ ఆజాద్ కొట్టిపారేశారు. తాను ఉపాధి కోసం వెతకడం లేదని.. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతోనే పార్టీ పెట్టినట్లు స్పష్టం చేశారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ స్థాపించి ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇక బీజేపీ పిలుపుతోనే జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లోకి తిరిగివచ్చినట్లు వస్తున్న విమర్శలపైనా ఆజాద్ తీవ్రంగా స్పందించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలంటే తనకు చాలా ఇష్టమని.. వారికి సేవ చేసేందుకే వచ్చినట్లు వెల్లడించారు. 2005 లో తాను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేయడానికి అదే కారణమని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం పదవి కోసం రెండు ముఖ్యమైన కేంద్ర మంత్రిత్వ శాఖలను వదిలేసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. 2005 లో అప్పటి యూపీఏ 1 ప్రభుత్వంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధితోపాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న గులాం నబీ ఆజాద్.. వాటిని వదిలేసి.. జమ్మూ కాశ్మీర్ సీఎంగా పని చేశారు.


ఇక గతేడాది వరకు కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించిన గులాం నబీ ఆజాద్.. కాంగ్రెస్‌కు బై బై చెప్పారు. ఆ తర్వాత డెమోగ్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీని స్థాపించి జమ్మూ కాశ్మీర్‌ రాజకీయాల్లోకి తిరిగి ప్రవేశించారు. అయితే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌ను రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయన్న ఆజాద్.. అవి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అని తెలిపారు. ఈ సమస్యను అధిగమించడానికి జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. తాను సీఎంగా ఉన్నపుడు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో 10 నుంచి 12 పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa