సముద్రంలో గల్లంతైన ఓ 14 ఏళ్ల బాలుడు.. నడి సంద్రంలో దొరికిన ఒక చెక్కను ఆసరాగా చేసుకొని 36 గంటలు పాటు ప్రాణాలను నిలుపుకున్నాడు. అనంతరం మత్స్యకారులు అతడ్ని గుర్తించి ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. ఆశ్చర్యకరమైన ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. సూరత్కు చెందిన వికాస్ దేవిపూజక్ (14) అనే బాలుడు తన స్నేహితుడు లక్ష్మణ్తో కలిసి మూడు రోజుల కిందట స్థానిక డుమాస్ బీచ్కు వెళ్లాడు. ఇద్దరూ కలిసి ఆటాడుకుంటుండగా ఊహించని రీతిలో ఓ రాకాసి అల వారిపై విరుచుకుపడింది. అలల తీవ్రతకు ఇద్దరూ సముద్రంలో గల్లంతయ్యారు.
అయితే, స్థానికులు లక్ష్మణ్ను రక్షించగా.. వికాస్ ఆచూకీ గల్లంతయ్యింది. 24 గంటలు గడిచిపోవడంతో కుటుంబసభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. అతడు ప్రాణాలతో ఉంటాడనే ఆశ వారికి సన్నగిల్లింది. కానీ, ఇంతలో అద్భుతం జరిగింది. గల్లంతైన వికాస్ను కొందరు మత్స్యకారులు ఒడ్డుకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేకపోయింది. చెక్క బోర్డును ఆసరాగా దొరకడం వల్ల బాలుడికి ప్రాణాపాయం తప్పిందని మత్స్యకారులు తెలిపారు. దానిని గణపతి విగ్రహాల తయారీలో అడుగుభాగాన ఉపయోగించే పెద్ద చెక్కగా గుర్తించారు. విగ్రహాల నిమజ్జనాల తర్వాత కింద భాగంలోని చెక్క సముద్రంలో తేలింది. వికాస్కు ఆ చెక్క దొరకడంతోనే దానిని ఆసరాగా చేసుకొని 36 గంటలు ప్రాణాలు నిలుపుకొన్నాడు.
వేటకు వెళ్లిన మత్స్యకారులు.. చెక్కను పట్టుకుని చేయి పైకెత్తి ఉన్న బాలుడ్ని గుర్తించి వెంటనే పడవను అతడి వద్దకు మళ్లించారు. వికాస్ను పడవలోకి ఎక్కించి ఒడ్డుకు తీసుకొచ్చారు. సముద్రంలో గల్లంతైన 36 గంటల తర్వాత కుమారుడు ప్రాణాలతో బయటకు రావడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. మృత్యువును జయించిన కుమారుడ్ని చూసి ఉద్వేగానికి గురయ్యారు. అనంతరం బాలుడ్ని ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి సాధారణంగా ఉందని, ఒంటరిగా 36 గంటల పాటు సముద్రంలో ఉండటం వల్ల ఆందోళనకు గురయ్యాడని వైద్యులు తెలిపారు. అయినా, ధైర్యంగానే ఉన్నాడని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa