శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో రైల్వేబోర్డు చైర్పర్సన్ జయవర్మ సిన్హాను కలిశారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు కీలకమైన విశాఖ ఎక్స్ప్రెస్ రైలుకు స్లీపర్, జనరల్ బోగీల సంఖ్య పెంచాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర ప్రయాణికుల ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి వేలాదిమంది ప్రయాణికులు రాక పోకలు సాగిస్తుంటారన్నారు. అందుకే భువనేశ్వర్- సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ రైలులో పది స్లీపర్కోచ్లు ఉండేవని.. వాటిని కుదించడంతో సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఈ రైలులో స్లీపర్, జనరల్ బోగీలు పెంచాలన్నారు.
అలాగే మరికొన్ని రిక్వెస్ట్లు కూడా చేశారు శ్రీకాకుళం ఎంపీ. వందేభారత్ సెమీ హైస్పీడ్ రైలును భువనేశ్వర్-విశాఖ మధ్య నడపాలని.. శ్రీకాకుళంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. ఈ నిర్ణయం తీసుకుంటే ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడతాయని తన వినతిపత్రంలో ప్రస్తావించారు. భువనేశ్వర్, పలాస మధ్య రాకపోకలు సాగిస్తున్న మెమూ రైళ్లను శ్రీకాకుళం వరకు పొడిగించాలని సిన్హాను కోరారు. విశాఖ- పలాస మెమూ రైళ్లను ఇచ్ఛాపురం వరకు నడపాలని విన్నవించారు. హౌరా-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఇచ్ఛాపురంలో నిలపాలని రిక్వెస్ట్ చేశారు. రౌర్కెలా-గుణుపూర్ రాజా-రాణి ఎక్స్ప్రెస్కు టెక్కలి, పాతపట్నంలో.. భువనేశ్వర్-రామేశ్వరం రైలుకు శ్రీకాకుళం రోడ్డు, పలాసలో హాల్ట్లు కల్పించాలని కోరారు. హౌరా-మైసూర్ సూపర్ఫాస్ట్ రైలుకు శ్రీకాకుళం రోడ్డు.. భువనేశ్వర్- విశాఖ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు హరిశ్చంద్రపురంలో హాల్ట్ కల్పించాలని ఎంపీ కోరారు. వారణాసి రైలుకు ఆమోదం తెలపడంపై రైల్వేశాఖకు కృతజ్ఞతలు తెలిపారు.సిన్హా కూడా ఈ అంశాలపై సానుకూలంగా స్పందించారని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa