గుంటూరు జిల్లాలో యువకుడిపై యాసిడ్ దాడి కలకలంరేపింది. తనతో సహజీవనంలో ఉన్న యువకుడిపై ఓ మహిళ యాసిడ్ దాడి చేసింది. నల్లపాడుకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఓ వాటర్ ప్లాంట్లో పనిచేస్తున్నాడు. అతడు ఆటోలో గుంటూరులో మంచినీటి డబ్బాలు చేరవేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి నగరంలోని రామిరెడ్డితోటలో ఉండే తెలంగాణ ఖమ్మం జిల్లా వైరాకు చెందిన రాధ అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. రాధాకు భర్త లేడు.. ఆమె చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసూ జీవనం సాగిస్తోంది.ఈ క్రమంలో వెంకటేష్ మూడు నెలల క్రితం రాధాను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నుంచి ఇద్దరు కలిసి అక్కడే ఉంటున్నారు.
వెంకటేష్ తీరు నచ్చని కుటుంబసభ్యులు రాధను ఇంటి నుంచి పంపించేశారు. తనపై వెంకటేష్, అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంకటేష్తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు కాగా.. తనను బయటకు గెంటేశారని వెంకటేష్పై కక్ష పెంచుకుంది. మంగళవారం మరో ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో వెళ్లిన రాధ.. తాగునీటి డబ్బాలు దించుతున్న వెంకటేష్పై వెనక నుంచి యాసిడ్ పోసింది. అతడు బాధతో పెద్దగా కేకలు వేయటంతో స్థానికులు అక్కడికి వచ్చారు.
జనాలు వచ్చేలోపు రాధ వచ్చిన ఆటోలోనే పరారైంది. ఆ తర్వాత స్థానికులు బాధితుడిని జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతున్న తనకు రాధ ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మహిళతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు.. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa