ప్రముఖ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూకు అరుదైన గౌరవం దక్కింది. కేరళలోని ప్రముఖ విష్ణు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో ఆమె ప్రత్యేక ఆహ్వానితురాలిగా పాల్గొన్నారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. త్రిశూర్లోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ఏటా జరిపే ప్రత్యేక నారీ పూజ కార్యక్రమాలకు ఓ మహిళను ఆహ్వానించి.. ఆమెను అక్కడి ఆలయ పండితులు సత్కరిస్తారు.
అలా ఈ ఏడాది ఆలయ నిర్వాహకులు నటి ఖష్బూను నారీ పూజ కోసం ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందో తెలియదు గానీ.. నటి కుష్బూ ఈ విషయాన్ని తన ఇన్స్ట్రాగామ్ పేజ్లో మంగళవారం పోస్ట్ చేశారు. విష్ణుమాయ ఆలయంలో నారీ పూజ కోసం తనను ఆహ్వానించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, ఆ భగవంతుడే తనను ఎంచుకున్నాడని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి గౌరవాన్ని తనకు కల్పించిన ఆలయ నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
విష్ణుమాయ ఆలయంలో సత్కారం
‘ఆ భగవంతుడి విశేష ఆశీస్సులు పొందాను. నారీ పూజలో భాగం కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను... కేవలం ప్రత్యేక ఆహ్వానితులకు మాత్రమే ఇందులో పాల్గొనే అవకాశం దక్కుతుంది. పూజలో పాల్గొనే వ్యక్తిని సాక్షాత్తూ ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం.. మనందరికీ ఆ దేవుడి ఆశీస్సులు ఉంటాయని నమ్ముతున్నాను.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ సంతోషం, శాంతితో జీవించాలని కోరుకున్నా’’ అని ఆమె తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
వేదపండితుల ఆశీర్వాదం
కాగా, త్రిశూర్లోని ప్రాచీన విష్ణుమాయ దేవాలయంలో ఏటా ఒకసారి నారీపూజ నిర్వహిస్తుంటారు. దీనిలో పాల్గొనే మహిళను ఆ భగవంతుడే ఎంచుకుంటారన్నది అక్కడి వారి విశ్వాసం. విష్ణు మాయను చాతన్.. కుట్టిచాతన్ అనే పేర్లతోనూ పిలుస్తారు. విష్ణుమాయ.. శివుడి అంశంతో జన్మించిన శివానందుడికి ఇంటిలోకి ప్రవేశం నిరాకరించడంతో విష్ణువు రూపాన్ని ధరించాడని, అలా 'విష్ణుమాయ'గా స్థిరపడ్డారని అంటారు. ఇక్కడ అమ్మవారు భువనేశ్వరి దేవిగా పూజలందుకుంటోంది. ఈ ఆలయానికి 500 శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa