కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య.. అనంతరం భారత్, కెనడాల మధ్య ఉద్రిక్త వాతావరణంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖలిస్థానీ సానుభూతి పరులు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే భారత్ వేదికగా గురువారం నుంచి జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ స్టేడియాలే లక్ష్యంగా దాడులకు పాల్పడతామని ఇప్పటికే ఖలిస్థాన్ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలోనే ప్రపంచకప్ ప్రారంభం అయ్యే కొన్ని గంటల ముందు స్టేడియంకు సమీపంలో ఉన్న ఓ ప్రభుత్వ భవనం గోడలపై ఖలిస్థానీ అనుకూల నినాదాలు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఉన్న జల్ శక్తి డిపార్ట్మెంట్ బిల్డింగ్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ స్ప్రే పెయింటింగ్ వేశారు. గురువారం నుంచి వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టోర్నీలో భాగంగా ధర్మశాల స్టేడియంలో ఐదు మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మశాల స్టేడియానికి సమీపంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ జల్ శక్తి డిపార్ట్మెంట్ బిల్డింగ్ గోడలపై ఖలిస్థానీ నినాదాలు రాయడం తీవ్ర కలకలం రేపుతోంది.
అయితే ఈ ఘటనను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనిపై దర్యాప్తును ప్రారంభించినట్లు కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు టీమ్స్.. ఖలిస్థానీ నినాదాలు రాసిన గోడలపై పెయింటింగ్ వేయించినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీ సేకరించి వాటి ద్వారా ఆ గోడలపై ఖలిస్థానీ రాతలు రాసిన దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు షాలినీ అగ్నిహోత్రి వెల్లడించారు. ఖలిస్థాన్ ఉగ్రవాదులు బెదిరింపులు, హెచ్చరికలు చేస్తున్న వేళ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
జులైలో కెనడాలో ఉన్న ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దానిపై కెనడా ప్రధాని భారత్పై ఆరోపణలు చేయడంతో కెనడాకు భారత్కు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ దేశాల్లో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారులు భారత్పై బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇక సిఖ్స్ ఫర్ జస్టిస్ అధినేత గుర్పత్వంత్ సింగ్ పన్నూన్.. భారత్ పట్ల తన అక్కసును వెల్లగక్కాడు. ఇక భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియంలపై దాడులకు దిగుతామని గుర్పత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరికలు కూడా జారీ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa