ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన కెనడా

national |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 09:56 PM

ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ర పాత్ర ఉందంటూ ఆరోపించిన కెనడా.. భారత్ తీసుకుంటున్న చర్యలతో ఆ దేశానికి ఊపిరి సలపడం లేదు. ఈ విషయంలో మిత్రదేశం అమెరికా సైతం పట్టించుకోకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. న్యూఢిల్లీలోని 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబరు 10లోగా ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ అల్టిమేటం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చర్యలతో ఖంగుతిన్న కెనడా.. కాళ్లబేరానికి వస్తోంది. తాము ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ఒట్టావా ప్రకటించింది. వాస్తవానికి నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్‌తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా.. దీన్ని బహిర్గతం చేసి వివాదాలకు కారణమైందని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.


భారత్‌తో ద్వైపాక్షిక వివాదాల పరిష్కారానికి ప్రైవేటుగా చర్చలను తాము కోరుకుంటున్నామని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చానళ్లు తెరుచుకునే ఉన్నాయని, రెండు వైపులా సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. ‘నిజానికి మన రెండు ప్రభుత్వాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి.. గతంలో కంటే దౌత్యవేత్తలు క్షేత్రస్థాయిలో ఉండటం చాలా ముఖ్యం.. అందుకే భారత్‌తో బలమైన దౌత్య సంబంధాల ప్రాముఖ్యతను మేము విశ్వసిస్తున్నాం... మేము భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం.. కెనడాను రక్షించడం కొనసాగిస్తాం’ అని ఆమె అన్నారు.


ప్రస్తుతం కెనడాకు ఢిల్లీలో ఎంబసీ, చండీగఢ్, బెంగళూరు, ముంబయిలో కాన్సులేట్ ఆఫీసులు ఉండడా... వీటిల్లో 62 మంది వరకు కెనడా దౌత్య సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో 41 మందిని ఉపసంహరించుకోవాలని భారత్ కోరింది. భారత్‌తో వివాదాన్ని కోరుకోవడం లేదని, కలసి బాధ్యతగా పనిచేయాలని అనుకుంటున్నట్టు కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు. భారత్ ఆదేశాల మేరకు దౌత్య సిబ్బందిని కెనడా ఉపసంహరించుకోనుంది. కెనడా విచారణకు సహకరించాల్సిందిగా అమెరికా మరోసారి భారత్‌ను కోరినప్పటికీ.. ఈ హత్యలో భారతీయ ఏజెంట్‌ల పాత్రకు సంబంధించిన ప్రమేయం గురించి ట్రూడో యంత్రాంగం తమతో ఎటువంటి నిర్దిష్ట సాక్ష్యాలను పంచుకోలేదని భారత ప్రభుత్వ వర్గాలు పునరుద్ఘాటించాయి. గత జూన్‌లో జరిగిన నిజ్జర్ హత్యలో భారత అధికారిక ప్రమేయాన్ని సూచించే భారతీయ దౌత్యవేత్తలకు సంబంధించిన సంభాషణలు ఒట్టావాలో ఉన్నాయని కెనడా మీడియా ఇంతకు ముందు నివేదించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa