ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిన్స్‌ కలిసిన పట్నాయక్

national |  Suryaa Desk  | Published : Wed, Oct 04, 2023, 09:57 PM

సౌమ్యుడు, వివాదరహితుడైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌ వివాదంలో చిక్కుకున్నారు. గతేడాది ఆయన వాటికన్ సిటీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ గుర్తుతెలియని మహిళ పక్కనే ఉన్నారనే వార్త గుప్పమంటోంది. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. సీఎం నవీన్‌ పట్నాయక్‌తో వాటికన్‌ సిటీ (రోమ్‌)కి వెళ్లిన ఆమె ఎవరని? ఆమె ఇటలీ వెళ్లడానికి విమానం టిక్కెట్టు ఎవరు కొనుగోలు చేశారని? ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు, మంత్రులు వెళ్లలేకపోతున్న సీఎం నివాసానికి ఆమె తరచూ ఎలా వెళ్లగలుగుతున్నారని నిలదీస్తున్నారు.


కాగా, ఆమె ముఖ్యమంత్రికి చికిత్స చేయడానికి వచ్చే ఫిజియోథెరపిస్ట్‌ అని.. ఆమె పేరు శ్రద్ధా అని కొన్ని వార్తా పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో శ్రద్ధా ఎవరని? ఆమె సీఎం వెంట వాటికన్‌ సిటీకి ఎందుకు? ఎలా వెళ్ల గలిగారని విపక్ష బీజేపీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మంగళవారం శాసనసభ వేదికగా దీనిపై ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శ్రద్ధా తన ఫిజియోథెరిపిస్ట్‌ అని, ఆమెను తన సోదరి దివంగత గీతా మెహతా పంపించారని ఆయన వెల్లడించారు. తన ఫిట్‌నెస్‌ కోసం ఆమెను నియమించినట్లు సీఎం పేర్కొన్నారు.


అంతేకాదు, ఆమెకు ప్రభుత్వం క్వార్టర్స్ గానీ... ప్రయాణ ఖర్చులుగానీ చెల్లించడం లేదని తెలిపారు. గతేడాది జూన్‌లో రోమ్‌ పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో సీఎం పక్కన ఉన్న ఆమె ఎవరంటూ ప్రతిపక్ష బీజేపీ ప్రశ్నించింది. అంతేకాదు, ఆమెకు ప్రభుత్వ నివాసాన్ని కేటాయించారంటూ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జయనారాయణ్ మిశ్రా ఆరోపించారు.


సీఎం రోమ్ పర్యటన సందర్భంగా జూన్ 22, 2022న పోప్ ఫ్రాన్సిస్ ఆశీర్వాదం కోసం వాటికన్ సిటీకి శ్రద్ధా.. నవీన్ పట్నాయక్‌తో కలిసి వెళ్లారని మిశ్రా ఆరోపణలు చేశారు. మూడో రోజు పోప్‌ను కలిసేందుకు అధికారికంగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి వీకే పాండియన్‌తో కలిసి వెళ్లారని మిశ్రా అన్నారు. ప్రపంచ ఆహార కార్యక్రమం ఆహ్వానం మేరకు పట్నాయక్ ఇటలీకి వెళ్లారు. కాగా, 2000 సంవత్సరంలో మొదటిసారి ఒడిశా రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన నవీన్ పట్నాయక్.. ఇప్పటి వరకు అప్రతిహతంగా అదే స్థానంలో కొనసాగుతున్నారు. ఆయన వరుసగా ఐదుసార్లు గెలిచి.. రికార్డు నెలకొల్పారు. దేశంలో ఓ రాష్ట్రానికి సీఎంగా అత్యధిక కాలం పనిచేసిన రెండో వ్యక్తి నవీన్ పట్నాయక్. ఇప్పటి వరకూ బెంగాల్‌కు అత్యధికాలం పనిచేసిన సీఎంగా జ్యోతి బసు పేరిట రికార్డు ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa