ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అరగంట అక్రమ నిర్బంధం.. రూ.50 వేల పరిహారం చెల్లించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:41 PM

ఓ వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసిన పోలీసులు.. అరగంట పాటు లాకప్‌లో నిర్బంధించడాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. బాధితుడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అక్రమ నిర్బంధంలో ప్రమేయమున్న ఇద్దరు పోలీసు అధికారుల వేతనం నుంచే ఈ మొత్తాన్ని వసూలుచేసి. పరిహారం ఇవ్వాలని సూచించింది. పోలీసులు చట్ట పరిధి దాటి ప్రవర్తించరాదని అధికారులకు బలమైన సందేశం పంపే ప్రాముఖ్యతను కోర్టు నొక్కి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సుబ్రమణియమ్ ప్రసాద్ ఆదేశాలు వెలువరించారు.


వివరాల్లోకి వెళ్తే.. కూరగాయలు అమ్ముకునే పంకజ్ కుమార్ శర్మ, క్రాంతి అనే మహిళకు మధ్య గతేడాది సెప్టెంబరు 2 న గొడవ జరిగింది. దీనిపై ఆమె బదార్‌పుర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మార్కెట్‌కు వెళ్లిన పోలీసులు.. రాత్రి 9 గంటల ప్రాంతంలో పంకజ్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అరగంట పాటు లాకప్‌లో బంధించిన అనంతరం పంకజ్‌ను విడిచిపెట్టారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా తన వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా పోలీసులు నిర్బంధించడాన్ని అతడు కోర్టులో సవాల్ చేశాడు. తనకు పరిహారం చెల్లించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును బాధితుడు ఆశ్రయించాడు.


దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసులు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదుచేయకుండా పంకజ్‌ను లాకప్‌లో అక్రమంగా నిర్బంధించినట్టు గుర్తించింది. తన కూరగాయల దుకాణానికి వచ్చిన మహిళ.. పంకజ్‌‌ మధ్య జరిగిన గొడవపై ఆమె ఫిర్యాదుపై కేసు నమోదుచేయలేదని కోర్టు విచారణలో తేలింది. ‘ఎఫ్‌ఐఆర్‌ లేకుండా బాధితుడిని అదుపులోకి తీసుకోవడం ఆందోళనకరం.. అరెస్టు చేయకుండానే అకారణంగా లాకప్‌లో నిర్బంధించారు.. పిటిషనర్‌ స్వేచ్ఛను హరించిన పోలీసులను తీరును సమర్థించలేం.. అందుకే అతడికి రూ.50 వేల పరిహారం చెల్లించాలి’ అని జస్టిస్ సుబ్రమణియమ్ ఆదేశించారు. ఈ మొత్తాన్ని సబ్ ఇన్‌స్పెక్టర్లు రాజీవ్ గౌతమ్, షమీమ్ ఖాన్‌ల నుంచి వసూలు చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa