తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆయన తనయుడు మంత్రి ఉదియనిధి స్టాలిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యేకు మద్రాసు హైకోర్టు షాకిచ్చింది. ఓ బహిరంగ సభలో సీఎం స్టాలిన్, మంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అంతేకాదు, ఎక్కడైతే వారి నుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారో.. అదేచోట బహిరంగ సభ పెట్టి అందరి ముందు క్షమాపణలు చెప్పాలని స్పష్టం చేసింది. తాను నోరుజారి చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలకు చింతిస్తూ సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పానన్న మాజీ ఎమ్మెల్యే వాదనను తోసిపుచ్చింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యేకు కోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
గత నెల 19న తమిళనాడులోని కల్లాకురిచ్చిలో అన్నాడీఎంకే నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆర్ కుమారుగురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్, ఆయన తనయుడు ఉదయనిధిలను విమర్శిస్తూ అసభ్య పదజాలాన్ని ప్రయోగించారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన డీఎంకే నేతలు.. మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153 (ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు రెచ్చగొట్టడం), 294బీ (అసభ్య పదజాలం వాడటం), 504 (శాంతి భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం) వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది.
ఈ కేసులో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకోడానికి మాజీ ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. రెండు రోజుల కిందట ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ జి జయచంద్రన్ ధర్మాసనం.. ముందస్తు బెయిల్ మంజూరుకు షరతుగా ఏ బహిరంగ సభలో ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేశారో.. అక్కడే వేదికను ఏర్పాటుచేసిన క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన నివేదికను తమకు సమర్పించాలని సూచించారు. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేశారు. నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అంతకు ముందు కుమారుగురు తరఫున వాదనలు వినిపించి న్యాయవాది.. తన క్లయింట్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పారని, అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారని వాదించారు. అయితే, వీటిని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. బహిరంగ సభ పెట్టి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు పిటిషనర్కు బహిరంగ సభ నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa