ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నిజమైన సవాలే.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:46 PM

2024 ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ నేతృత్వంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ను గద్దె దించాలన్న లక్ష్యంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి ఇండియా అని పేరు కూడా పెట్టాయి. అయితే ఈ ఇండియా కూటమి ఏర్పడినప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి నిజమైన సవాల్ విసురుతుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.


విపక్ష ఇండియా కూటమి తమకు నిజమైన సవాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి కూడా దేశానికి సేవలందించాలన్నదే బీజేపీ అజెండా అని స్పష్టం చేశారు. ఎలాంటి ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని అందుకే ఇండియా కూటమిని ప్రధాన సవాల్ అని తాను భావిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కింది స్థాయి కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకు బీజేపీలో ప్రతి ఒక్కరూ చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేస్తారని తెలిపారు. ఎన్నికల్లో ప్రధాని నరంద్ర మోదీ తమను ముందుండి నడిపిస్తుంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన మనసులో ఉన్న మాటను ధర్మేంద్ర ప్రధాన్ బయటపెట్టారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన సొంత రాష్ట్రమైన ఒడిశా నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు స్పష్టం చేశారు. తనకు స్వరాష్ట్రం నుంచి లోక్‌సభ బరిలో ఉండే అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.


ఇక మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. దేశంలోని మహిళలకు రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఆదర్శంగా నిలిచారని వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి చిత్తశుద్ధి కూడా చూపించలేదని.. బిల్లు గడువు కూడా తీరిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం కల్పించే అవకాశం వచ్చినా కాంగ్రెస్ దాన్ని ఉపయోగించుకోలేకపోయిందని విమర్శించారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న డిమాండ్‌ పట్ల ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. గత 75 ఏళ్లలో ఓబీసీలు, బలహీన వర్గాల కోసం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చెప్పాలని ఆయన చురకలు అంటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa