ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ దెబ్బకు డెడ్‌లైన్‌కు ముందే దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించిన కెనడా

national |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 09:46 PM

కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ వ్యవహారంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే కెనడాలోని భారత రాయబారిని బహిష్కరించడంతో.. అంతే ధీటుగా భారత్ బదులిచ్చింది. భారత్‌లోని కెనడా రాయబారిని బహిష్కరించింది. దీంతోపాటు భారత్‌లో ఉంటున్న కెనడా దౌత్య అధికారుల సంఖ్యను తగ్గించుకోవాలని ఆ దేశానికి కేంద్ర ప్రభుత్వం సూచించింది. వీలైనంత త్వరగా వారిని భారత్ నుంచి తరలించాలని అందుకు అక్టోబర్ 10 వ తేదీని గడువును విధించింది. ఈ క్రమంలోనే డెడ్‌లైన్ కంటే ముందుగానే కెనడా స్పందించింది.


దౌత్యాధికారుల తొలగింపునకు భారత్‌ విధించిన డెడ్‌లైన్‌పై చర్యలు చేపట్టిన కెనడా.. ఢిల్లీ కాకుండా భారత్‌లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ దౌత్య అధికారులను వెనక్కి పిలిపించుకుంది. భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న కెనడా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న దౌత్య అధికారుల్లో చాలా మందిని మలేషియా, సింగపూర్‌ దేశాలకు కెనడా తరలించినట్లు తెలుస్తోంది. కెనడాలో ఉన్న భారత దౌత్య అధికారుల సంఖ్యకు అనుగుణంగా భారత్‌లో కూడా అదే సంఖ్యలో కెనడా దౌత్య అధికారులు ఉండాలని భారత్ కెనడాకు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 10 వ తేదీ నాటికి భారత్‌లో ఎక్కువగా ఉన్న సుమారు 41 మందిని తొలగించాలని డెడ్‌లైన్‌ విధించింది.


ఈ ఏడాది జూన్‌ 18 వ తేదీన ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు హత్య చేశారు. అయితే ఆ హత్యలో భార‌త ఏజెంట్ల హ‌స్తం ఉందని కెన‌డా ప్ర‌ధాని జస్టిన్ ట్రూడో ఏకంగా ఆ దేశ పార్లమెంటులోనే తీవ్ర ఆరోప‌ణ‌లు చేయడం తీవ్ర దుమారానికి కారణం అయింది. అంతటితో ఆగకుండా భారత సీనియర్‌ దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరించారు. ఈ చర్యతో భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌లో ఉన్న కెనడా సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించి నిరసనను వ్యక్తం చేసింది. మరోవైపు.. జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు భారత్ ఖండించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు.. భారత్‌ వేదికగా ఢిల్లీలో జరగనున్న జీ 20 పార్లమెంట్ స్పీకర్ల సమ్మిట్‌కు హాజరు కానున్నట్లు కెనడా ప్రకటించింది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నప్పటికీ ఈ సదస్సులో పాల్గొననున్నట్లు కెనడా స్పష్టం చేసింది. ఈ విషయాన్ని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు. అక్టోబరు 12 వ తేదీ నుంచి 14 వరకు ఢిల్లీలో జీ20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ జరుగుతుందని తెలిపారు. ఈ సమ్మిట్‌కు జీ20 కూటమి దేశాలను ఆహ్వానించినట్లు వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa