సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టామంటే చాలు.. తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తామో తెలియని పరిస్థితి. ఇక ఇంటి నుంచి ఆఫీస్కు.. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లాలంటే ఉద్యోగులు నరకం చూడాల్సిందే. ఇక ట్రాఫిక్లోనే వర్క్ చేయడం, తినడం, కూరగాయలు కోయడం.. సహా ఇలాంటి ఎన్నో పనులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్తో ఆడేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సమస్యలను అధిగమించేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే బెంగళూరు నగరంలో టన్నెల్ రోడ్లు నిర్మించాలని సిద్ధరామయ్య సర్కార్ నిర్ణయించింది.
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు నగర ఇంఛార్జ్ డీకే శివ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు బెంగళూరులో 190 కిలోమీటర్లు టన్నెల్ రోడ్లు నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. టన్నెల్ రోడ్ల నిర్మాణం కోసం పిలిచిన టెండర్లలో 9 కంపెనీలు పాల్గొన్నాయని.. అందులో 8 కంపెనీలు అర్హత సాధించినట్లు తెలిపారు. అయితే ఆ 8 కంపెనీలు మరో 45 రోజుల్లో ఫీజబులిటీ రిపోర్ట్ను అందిస్తాయని వెల్లడించారు. అక్టోబర్ చివరి నాటికి ప్రాజెక్ట్ కన్సల్టెంట్ను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు.
వీటితో పాటు టన్నెల్ రహదారుల ప్రక్రియను కూడా ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అయితే ఈ టన్నెల్ రోడ్లను 4 లేన్లుగా నిర్మించాలా లేక 6 లేన్లుగా నిర్మించాలా అనేది నిర్ణయించాల్సి ఉందని పేర్కొన్నారు. అయితే ఈ టన్నెల్ రోడ్లు ఎక్కడ ప్రారంభించి ఎక్కడి వరకు వేయాలి.. బెంగళూరు నగరమంతటా వీటిని విస్తరించాలా అనే అంశంపై నిపుణుల నుంచి సలహాలు సూచనలు కోరినట్లు తెలిపారు. ఒక వేళ ఈ టన్నెల్ నిర్మాణాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయితే వాటిని నిర్మించేందుకు భారీగా నిధులు అవసరం అవుతాయని తెలిపారు. దాన్ని అధిగమించేందుకు దశల వారీగా చేపట్టాలనే ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. వీటి కోసం వివిధ కంపెనీల నుంచి పెట్టుబడులు ఆహ్వానించే అవకాశాన్ని కూడా పరిశీలనలో ఉంచినట్లు చెప్పారు.
ముఖ్యంగా బెంగళూరులో అధికంగా ట్రాఫిక్ ఉండే బళ్లారి రోడ్డు, పాత మద్రాసు రోడ్డు, ఎస్టీ మాల్ జంక్షన్ నుంచి మెఖ్రి సర్కిల్ వరకు, సర్జాపుర రోడ్డు, హొసూరు రోడ్డు, కనకపుర రోడ్డు, యశ్వంతపుర రోడ్డు, కేఆర్ పురం, సిల్క్ బోర్డు వంటి ప్రాంతాల్లో టన్నెల్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు డీకే శివకుమార్ వెల్లడించారు. టన్నెల్ తవ్వేందుకు భారీ యంత్రాలను ముంబై, ఢిల్లీ నగరాల నుంచి తెప్పించాల్సిన అవసరం ఉందన్నారు. బెంగళూరు శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినపుడు నగరంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని.. దీన్ని వల్ల నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa