ప్రస్తుతం దేశం మొత్తాన్ని మహదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం కుదిపేస్తోంది. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ.. వరుసగా సమన్లు జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ బెట్టింగ్ యాప్ ఆగడాలపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణలపై బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్లకు ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని పేర్కొంది. అయితే గత నెలలో దేశంలోని 39 ప్రాంతాల్లో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో బంగారం, ఆభరణాలు, నగదు మొత్తం రూ.417 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వ్యక్తులను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన సూత్రదారులు, యాప్ ప్రమోటర్లు దుబాయ్లో ఉన్నట్లు గుర్తించారు.
అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో రూ. 200 కోట్ల ఖర్చుతో జరిగిన ఓ అత్యంత ఖరీదైన పెళ్లి.. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలకు నగదు రూపంలో డబ్బులు చెల్లించిన తర్వాత మహాదేవ్ యాప్పై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించి దర్యాప్తు చేపట్టాయి. ఛత్తీస్గఢ్లోని బిలాయ్కి చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ అనే ఇద్దరు వ్యక్తులు మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ను దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. విచారణలో భాగంగా ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ఆపరేటింగ్, బెట్టింగ్ విధానాలు చూసి ఈడీ అధికారులు షాక్ అయ్యారు. ఈ బెట్టింగ్ యాప్ నాలుగు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. భారత్, మలేషియా, థాయ్లాండ్, యూఏఈ దేశాల్లో వందలాది కాల్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా మరిన్ని యాప్లు, వెబ్సైట్లు క్రియేట్ చేయడానికి నిరంతరం పని చేసినట్లు తెలిపారు. ఒక్క భారత్లోనే దాదాపు 4 వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారని.. అందులో ఒక్కో ఆపరేటర్కు 200 మంది కస్టమర్లు ఉన్నట్లు తేల్చారు. ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా రోజుకు రూ. 200 కోట్ల లాభాన్ని పొందినట్లు ఈడీ పేర్కొంది.
ఈ కేసులో దాదాపు 17 మంది ప్రముఖ సెలబ్రిటీలు, బాలీవుడ్ నటీనటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే ఈ మహదేవ్ యాప్ను ఆన్లైన్లో ప్రచారం చేసి.. దానికి ప్రతిఫలంగా ప్రమోటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని ఈడీ అధికారులు అభియోగాలు మోపారు. అయితే ఈ డబ్బు కూడా హవాలా రూపంలో నగదు చెల్లింపులు చేసినట్లు ఈడీ వెల్లడించింది. దీంతో వారందరికీ త్వరలోనే ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ హవాలా చెల్లింపులు ఎలా జరిగాయన్నదానిపై విస్తృత పరిశోధన చేస్తున్నారు.
భారత్లోని 30 కాల్ సెంటర్లను దుబాయ్లో ఉన్న సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్లకు అత్యంత సన్నిహితులైన అనిల్ దమ్మాని, సునీల్ దమ్మాని అనే ఇద్దరు సోదరులు నిర్వహిస్తున్నారని గుర్తించిన ఈడీ అధికారులు వారిద్దరినీ అరెస్ట్ చేశారు. ఈ భారీ కుంభకోణంలో పోలీసులు, రాజకీయ నాయకులు, అధికారులు సాయం చేసినట్లు.. ప్రతిఫలంగా వారికి వాటాలు కూడా ఇచ్చారని ఈడీ అనుమానిస్తోంది. ఈ దమ్మాని సోదరులు గత రెండేళ్లలో రూ. 60 నుంచి రూ.65 కోట్ల విలువైన లావాదేవీలు చేసినట్లు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa