జ్యోతిషురాలు ఇచ్చిన చాక్లెట్ తిని ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. విచిత్రంగా ఆమెకు ప్రాణగండం ఉందని కొద్ది రోజులకు కిందట పెద్దావిడ చెప్పడం గమనార్హం. ఈ విషాదకర ఘటన బ్రెజిల్లోని ప్రముఖ పర్యాటక నగరం మాసియోలో చోటుచేసుకుంది. ఆ దురదృష్టవంతురాలి పేరు ఫెర్నాండా వాలోజ్ పింటో. నగరంలోని ప్రముఖ హస్త సాముద్రిక నిపుణురాలిని పింటో ఇటీవల కలిశారు. ఆమెకు తనచేతిని చూపించి.. భవిష్యత్తు ఏంటో చెప్పమని అడిగారు. ఈ క్రమంలో ఆమె చేతిని పరిశీలించిన పెద్దావిడ. నీ జీవితంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని.. ఆయువు తీరిపోనుందని చెప్పింది. అనంతరం ఆమెకు ఊహించని బహుమతిగా చాక్లెట్ ఇచ్చింది.
పింటో బంధువు బియాంకా క్రిస్టినా అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ చాక్లెట్ తిన్న తర్వాత పింటో ఆరోగ్యం ఎలా క్షీణించిందో క్రిస్టినా వివరించింది. చాక్లెట్ తిన్న గంట సేపటికి ఆమె వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. కంటిచూపు మసకబారి, శరీరం బలహీనపడిందని క్రిస్టినా చెప్పింది. ఈ లోకాన్ని వదలిపెట్టి వెళ్లిపోవడానికి కొద్ది గంటల ముందు పింటో తన బాధను కుటుంబ సభ్యులకు ఫోన్ మెసేజ్ల ద్వారా తెలియజేసింది. తన గుండె వేగంగా కొట్టుకుంటోందని, నోరంతా చేదుగా ఉందని పేర్కొంది. చాక్టెల్ తిన్న రోజు ఉదయం తనకు వింతగా మత్తుగా అనిపించిందని తెలిపింది. దాదాపు తాను మరణం అంచున ఉన్నానని కుటుంబసభ్యులకు తెలియజేసి కన్నీళ్లుపెట్టుకుంది.
ఆశ్చర్యకరంగా ఆమె పోస్ట్మార్టం నివేదికలో భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శరీరంలో సల్ఫోటెప్, టెర్బుఫోస్ అనే పురుగుమందుల స్థాయిలను భయంకరస్థాయిలో ఉన్నట్టు తేలింది. పింటో శరీరంలోకి చాక్లెట్ ద్వారా విషం వచ్చిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జ్యోతిషం చెప్పిన మహిళ.. ఆమెకు హాని తలపెట్టే ఉద్దేశంతో చాక్లెట్ ఇచ్చి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఆ దిశగా విచారణ జరుపుతున్నారు.
పింటో మరణం ఉద్దేశపూర్వకంగా జరిగిన చర్యా? లేక దురదృష్టకర సంఘటనా? అనే విషయం పోలీసుల విచారణ వెలుగులోకి వస్తుందని ఆమె బంధువు లుమెనిటా వాలోజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘పింటోను ఇలా చేయడానికి కారణం కనిపించడం లేదు.. కానీ ఎవరి హృదయంలో ఏముందో మాకు తెలియదు’ అని వాలోజ్ గద్గద స్వరంతో వ్యాఖ్యానించాడు. ఈ విషాద కేసుపై సమగ్ర దర్యాప్తు చేయవలసిన అవసరాన్ని మాత్రం అతడు ఎత్తిచూపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa