ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇజ్రాయేల్‌పై హామాస్ ఉగ్రవాదులు మెరుపు దాడి.. 20 నిమిషాల్లోనే 5 వేల రాకెట్లు ప్రయోగం

international |  Suryaa Desk  | Published : Sat, Oct 07, 2023, 10:04 PM

ఇజ్రాయేల్‌, పాలస్తీనా మధ్య ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయేల్‌పై హమాస్ ఉగ్రవాదులు గాజా స్ట్రిప్ నుంచి భీకర రాకెట్ దాడులతో విరుచుకుపడ్డారు. దీంతో ఇజ్రాయేల్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి.. యుద్ధంపై ప్రకటన చేసింది. 20 నిమిషాల వ్యవధిలో ఐదు వేలకుపైగా రాకెట్లు ఆకాశం నుంచి దూసుకురావడంతో శనివారం ఉదయం దేశవ్యాప్తంగా పెద్ద సైరన్లు మోగాయి. ఇజ్రాయెల్‌లోకి హమాస్ మిలిటెంట్ల చొరబాటుతో ఆ దేశ రక్షణ దళాలు కూడా అప్రమత్తమయ్యాయి. దాడిలో పారాగ్లైడర్లను ఉపయోగించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ చక్కెర్లు కొడుతున్నాయి. అటు, హమాస్ ఉగ్రవాదులు ఇది ఆరంభం మాత్రమేనని ప్రకటించారు.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ఏడాదిన్నరగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇజ్రాయేల్-పాలస్తీనా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ఆందోళన కలిగిస్తోంది. ‘గాజా స్ట్రిప్ నుంచి పెద్ద సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయేల్ భూభాగంలోకి చొరబడ్డారు.. గాజా పరిసర ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్ల నుంచి బయటకు రావద్దు’ అని ఇజ్రాయేల్ రక్షణ దళాలు ట్వీట్ చేశారు. రాకెట్ దాడులతో అనేక ప్రాంతాలు ప్రభావితం కావడంతో పవిత్ర నగరం జెరూసలేం సహా ఇజ్రాయెల్ అంతటా సైరన్‌లు మోగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ నలుగురు పౌరులు చనిపోయినట్టు ఇజ్రాయేల్ ధ్రువీకరించింది. హమాస్ సాయుధ విభాగం ‘ఆపరేషన్ అల్-అక్సా ఫ్లడ్’ ప్రారంభించినట్లు ప్రకటించింది. తమ మొదటి దాడిలో 20 నిమిషాల్లో 5,000 రాకెట్లను పేల్చినట్లు తెలిపింది. ‘ఆక్రమణదారుల (ఇజ్రాయెల్) అన్ని నేరాలకు ముగింపు పలకాలని మేము నిర్ణయించుకున్నాం.. జవాబుదారీగా ఉండకుండా విధ్వంసం చేసే వారి సమయం ముగిసింది’ అని హమాస్ హెచ్చరించింది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న తీవ్ర ఘర్షణలు భారీ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని గతంలోనే ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. వందేళ్ల కిందట ఈ వివాదం రాజుకుంది.


పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు తమ పూర్వీకుల నివాసంగా భావిస్తారు. ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని వారు వాదిస్తున్నారు. మరోవైపు పాలస్తీనియన్ అరబ్బులు కూడా అది తమ మాతృభూమి అని.. యూదుల ఆక్రమణను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పాలిస్తున్న ఒట్టోమన్ సామ్రాజ్యం ఓటమిని చవి చూసిన తరువాత ఆ ప్రాంతం బ్రిటన్ ఆధీనంలోకి వచ్చింది. పాలస్తీనాలో యూదులకు 'ప్రత్యేక రాజ్యం' ఏర్పాటు చేసే బాధ్యతను అంతర్జాతీయ సమాజం బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. ఆ ప్రాంతంలోకి 1920-40 మధ్య యూదులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో.. ఘర్షణలకు ఆజ్యం పోసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa