2023 ఏడాదికి గానూ వివిధ రంగాల్లో నోబెల్ బహుమతులు గెలుచుకున్న విజేతల పేర్లను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్య రంగాలకు సంబంధించి 2023 ఏడాదికి నోబెల్ బహుమతి గెలుచుకున్న వారి పేర్లను వెల్లడించారు. తాజాగా ఈ సంవత్సరం నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్న విజేతను శుక్రవారం ప్రకటించారు. ఇరాన్కు చెందిన మానవ హక్కుల కార్యకర్త, లాయర్, ఫ్రీడం ఫైటర్ నార్గెస్ మహమ్మది ఈ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. గతేడాది ఇరాన్లో మహిళల హక్కుల కోసం నార్గెస్ మహమ్మది చేసిన అలుపెరుగని పోరాటానికి గానూ ఈ ఏడాది ఆమెకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే ప్రస్తుతం నార్గెస్ మహమ్మది జైలులో ఉన్నారు.
2022 సెప్టెంబరులో ఇరాన్లో హిజాబ్ సరిగా ధరించలేదని.. 22 ఏళ్ల మహ్సా జినా అమ్నీని మోరల్ పోలిసింగ్ చేస్తున్న పోలీసులు తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన ఇరాన్ వ్యాప్తంగా కొన్ని నెలలపాటు తీవ్ర ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలకు దారి తీసింది. ఇరాన్లో కొనసాగుతున్న మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా లక్షలాది మంది మహిళలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఈ క్రమంలోనే ఈ నిరసనల్లో ముందుండి పోరాడిన నార్గెస్ మహమ్మదికి ఈ నోబెల్ శాంతి పురస్కారం దక్కడం విశేషం. మహిళలు- జీవితం-స్వేచ్ఛ అనే నినాదాలతో నార్గెస్ మహమ్మది పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఈ విషయాలన్నింటినీ నోబెల్ శాంతి బహుమతి విజేతను ప్రకటించిన వేళ నోబెల్ కమిటీ వెల్లడించింది.
మానవ హక్కుల సాధన కోసం నార్గెస్ మహమ్మది ఎన్నో కఠినమైన పోరాటాలను చేశారు. దీంతో ఆమెను 13 సార్లు అరెస్ట్ చేశారు. అందులో 5 కేసుల్లో దోషిగా తేలారు. దీంతో ఆమెకు అన్ని కేసుల్లో కలిపి 31 ఏళ్ల జైలు శిక్ష విధించారు. జైలు శిక్షతోపాటు 154 కొరఢా దెబ్బలు కూడా వేశారు. ప్రస్తుతం ఈ కేసుల్లో నార్గెస్ మహమ్మది జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆమె జైలులో ఉండగానే నోబెల్ శాంతి బహుమతి దక్కడం విశేషం. సోమవారం మొదలైన ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన వారం రోజుల పాటు సాగనుంది. సోమవారం మెడిసిన్, మంగళవారం ఫిజిక్స్.. బుధవారం కెమిస్ట్రీ.. గురువారం లిటరేచర్ విభాగాల్లో 2023 ఏడాదికి గానూ నోబెల్ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను స్వీడిష్ కమిటీ వెల్లడించింది. ఇక శుక్రవారం నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న నార్గెస్ మహమ్మది పేరును వెల్లడించారు. ఈ నెల 9 వ తేదీన అర్ధ శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న విజేతల పేర్లను ప్రకటించనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 10 వ తేదీన విజేతలకు నోబెల్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. గతంలో నోబెల్ బహుమతి గెలుచుకున్న వారికి ఇచ్చే నగదు బహుమతి రూ.7.58 కోట్లు ఉండగా.. దాన్ని ఈసారి కాస్త పెంచి.. రూ.8.35 కోట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa