ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సుప్రీంకోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్‌పై కొనసాగుతోన్న వాదనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 09, 2023, 06:45 PM

స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మరోసారి చుక్కెదురయ్యింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌‌ను విజయవాడలోని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఇదే సమయంలో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ అధికారులు వేసిన పిటిషన్‌ను తిరస్కరించడం గమనార్హం. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెప్టెంబరు 10న అరెస్టయిన మాజీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు. అక్టోబరు 5న మూడోసారి చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించిన విషయం తెలిసిందే.


కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వ్యవహారంలో సీఐడీ తనపై నమోదుచేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం మరోసారి విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు హరీష్‌ సాల్వే, అభిషేక్‌ మను సింఘ్వీ, సిద్ధార్థ లూథ్రా.. ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ, రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై అక్టోబరు 3న ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. హైకోర్టుకు సమర్పించిన పత్రాలను తమకు అందజేయాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.


ప్రస్తుతం 17ఏ చుట్టూనే వాదనలు తిరుగుతున్నాయి. రాజకీయ కారణాలతో కక్ష సాధింపునకు పాల్పడకుండా 17ఏను తీసుకొచ్చారని చంద్రబాబు తరఫు లాయర్ హరీశ్ సాల్వే అన్నారు. 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనలేదని, 2021లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగానే రిమాండ్‌ రిపోర్టు ఉందని పేర్కొన్నారు. దాని ఆధారంగా మేం చెప్పదలచుకుంది 17ఏ వర్తిస్తుందనేదని, 1959 ఎస్‌ఈఆర్‌ 191 కేసు జడ్జిమెంట్‌ ప్రకారం చట్టసవరణకు ముందు కేసులకు కూడా వర్తిస్తుందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.


మరోవైపు, చంద్రబాబుపై ఏసీబీ కోర్టులో ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో పెండింగ్‌లో ఉన్న పీటీ వారెంట్లపై విచారణ ప్రారంభమైంది. ఆయన తరఫు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా పీటీ వారెంట్లపై విచారణ అవసరం లేదని, కోర్టు నిర్ణయం తీసుకుంటే చాలని సీఐడీ తరఫు లాయర్లు వాదించారు. దీనికి చంద్రబాబు లాయర్లు కౌంటర్ ఇస్తూ.. వాదనలు వినిపించవచ్చని జడ్జికి వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa