విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు అధికారులు.. తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల్ని సిటీ సర్వీసులుగానే నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. వీటికోసం సింహపురి, గాజువాక డిపోలు ఎంపిక చేసింది ఆర్టీసీ. రాష్ట్రంలో ఇప్పటికే తిరుపతి నుంచి ఎలక్ట్రిక్ బస్ సర్వీసులు నడుస్తున్నాయి. తిరుపతి నుంచి తిరుమల, నెల్లూరు, కడప, రేణిగుంట ఇలా కొన్ని సర్వీసులు నడుస్తున్నాయి. అయితే రాష్ట్రంలోని మిగిలిన నగరాల్లో కూడా ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని భావిస్తున్నారు. త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సుల్ని కొనుగోలు చేసి రోడ్డెక్కించనున్నారు. ఇప్పటికే తొలి దశలో వెయ్యి విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేశారు అధికారులు. వీటిలో 200 బస్సులు విశాఖకు కేటాయిస్తారని చెబుతున్నారు. విశాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దసరా (అక్టోబర్ 23) నుంచి సాగర తీర నగరంలో పాలన ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే విశాఖకు 200 బస్సులు కేటాయించారనే చర్చ కూడా జరుగుతోంది. అలాగే విశాఖ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా సిద్దం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa