రాజమండ్రి సెంట్రల్లో జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా చంద్రబాబు ఆరోగ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఒక కిలో బరువు పెరిగారని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారన్న సజ్జల.. తప్పు చేసినవాడు సంజాయిషీ ఇవ్వాల్సిందిపోయి.. నిలదీయడం ఏంటన్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో.. తూకం వేస్తే ఆయన ఒక కేజీ బరువు పెరిగాడన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే.. తప్పు చేయలేదని కొట్లాడాలన్నారు. ఏసీ కావాలని అడగటం జైలు ఏమైనా అత్తగారి ఇల్లా? అని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు ఓ ఖైదీ అన్న సజ్జల.. ప్రభుత్వం వైపు నుంచి ఆయనకు వీలైనన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. ఏసీ పెట్టడానికి, కారవాన్ పంపడానికి ఇక జైలుకు పంపడం ఎందుకన్నారు. స్కిన్ అలర్జీ విషయానికి వస్తే.. ఉక్కపోత వల్ల వస్తుండొచ్చన్నారు. చంద్రబాబును తాము ఇబ్బంది పెడుతున్నామని ప్రజలెవరూ అనుకోవద్దన్నారు. జైలు అధికారులు సైతం ప్రెస్ మీట్ పెటాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా సైతం చంద్రబాబు ఆరోగ్యం గురించి నిజాలు చెప్పొచ్చన్నారు. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ 70 ఏళ్ల వయసులో జైల్లో ఉండలేదా అని సజ్జల ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని హక్కు చంద్రబాబుకే ఉంటుందని.. ఆయన కుటుంబీకులు అనుకోవడం ఏంటని సజ్జల నిలదీశారు.
జైల్లో వేలాది మంది ఖైదీలు ఉన్నారు.. మరి చంద్రబాబు ఏరకంగా ప్రత్యేకమైన ఖైదీ అని సజ్జల ప్రశ్నించారు. రాజకీయ నాయకులు ఉండే కొన్ని ప్రత్యేకమైన ప్రివిలేజెస్ చంద్రబాబుతో సహా జైళ్లలో ఉండే పొలిటిషన్స్కు వర్తిస్తాయన్నారు. రాజమండ్రిలో ఉక్కపోత వల్ల, ఆయన చొక్కా విప్పకపోవడం వల్ల హ్యుమిడిటీతో ఆయనకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఉండొచ్చన్నారు. ‘చంద్రబాబు కోసం స్నేహ బ్యారెక్ మొత్తాన్ని అట్టిపెట్టారు. డాక్టర్లను ఈయన కోసం 24 గంటలూ అటెన్షన్లో ఉంచుతున్నారు. ఇంటి దగ్గర్నుంచే ఆహారం, వాటర్ బాటిళ్లు తీసుకెళ్తున్నారు. ఆ ఆహారాన్ని కూడా జైలు అధికారులు తనిఖీ చేస్తున్నార’ని సజ్జల తెలిపారు. ‘జైల్లో వాటర్ ట్యాంకర్లలోని నీరు బాగోలేవని భువనేశ్వరి చెబుతున్నారు. ఆ నీళ్లతో స్నానం చేస్తే కూడా ఇబ్బందేనా..? అడిగితే జైలు నుంచి స్నానానికి నీళ్లను సైతం తెచ్చి ఇస్తారేమో. చంద్రబాబును ఎలాగైనా జైలు నుంచి బయటకు తేవాలనేది నారా కుటుంబీకుల ఉద్దేశంగా కనిపిస్తోంది. ఏదోలా జైలు నుంచి బయటకు వస్తే.. ఈ రాష్ట్రంలో తమకు సెక్యూరిటీ లేదని మరో రాష్ట్రానికి వెళ్తారేమో’ అని సజ్జల అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa