ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఒంగోలుకు రోడ్డు మార్గం ద్వారా కారులో విజయమ్మ బయల్దేరారు. మార్గమధ్యలో సంతమాగులూరు వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. విజయమ్మ కూర్చున్న వాహనం నడుపుతున్న డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక వేగంగా వస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో ఆమె ప్రయాణిస్తున్న కారు వెనుక భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో విజయమ్మకు గానీ, కారులో ప్రయాణిస్తున్న ఇతరులకుగానీ ఎటువంటి గాయాలు కాలేదు. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్ది సేపటి తర్వాత అదే కారులో ఆమె ఒంగోలుకు చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతోన్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను విజయమ్మ పరామర్శిచారు. ప్రమాదం విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కుమార్తె షర్మిల.. తమ తల్లికి ఫోన్ చేసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, వైవీ సుబ్బారెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వయసుపైబడటంతో తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. గతేడాది కూడా అస్వస్థతకు గురికావడంతో విజయమ్మ వచ్చి పరామర్శించారు. సరిగ్గా ఏడాది కిందట సెప్టెంబరు 25న ఒంగోలుకు వచ్చి పిచ్చమ్మను పరామర్శించి విజయమ్మ.. ఆమెతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అంతా సర్దుకుంటుందని... ధైర్యం చెప్పారు. మళ్లీ మరోసారి ఆమె అనారోగ్యానికి గురికావడంతో శుక్రవారం హైదరాబాద్ నుంచి వెళ్లారు. ఈ క్రమంలోనే వాహనం ప్రమాదానికి గురయ్యింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa