ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో వేసవిని తలపిస్తోన్న ఎండలు.. అప్పటి వరకూ ఇదే పరిస్థితి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 06:02 PM

రాష్ట్రంలో భానుడి భగభగలు వేసవిని తలపిస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు నిష్క్రమణ చివరి దశకు చేరుకోగా... ఈ ఏడాది లోటు వర్షపాతం నమోదయ్యింది. అటు, వర్షాలు లేక మెట్ట ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి. సాధారణంగా అక్టోబరులో ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి. నైరుతి నిష్క్రమణ.. ఈశాన్యం ప్రవేశించే సమయంలో ఉష్ణోగ్రతలు వాతావరణం వేసవి మాదిరిగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎండల ప్రభావాన్ని ‘అక్టోబరు హీటింగ్‌’గా అభివర్ణించారు. నైరుతి నిష్క్రమించి, ఈశాన్య రుతుపవనాలు ప్రారంభంలో గాలుల దిశ మారి, ఇలాంటి సమయంలో సముద్రంలో అధిక పీడనం కొనసాగుతుంది. దీంతో భూ ఉపరితలంపైకి తేమగాలులు వీచి వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ, ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మధ్యభారతంలో అధికపీడనం కారణంగా భూఉపరితలంపై నుంచి గాలులు వీస్తుండటం వల్ల రాష్ట్రంలో తేమతగ్గి పొడి వాతావరణం నెలకుంది.


సముద్ర ఉపరితలం మీదుగా గాలులు వీస్తే వాతావరణం కాస్త చల్లబడి, వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. కానీ, గత పది రోజుల నుంచి మధ్య భారతం మీదుగా వస్తున్న వేడి గాలులతో వర్షాభావ పరిస్థితులు కొనసాగి వాతావరణం వేసవిని తలపిస్తోంది. వర్షాలు లేకపోవడంతో పంటలపై ప్రభావం పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఉత్తర తెలంగాణ వరకు నిష్క్రమించిన నైరుతి రుతుపవనాలు ఇవాళా లేదా రేపటికల్లా దేశం నుంచి పూర్తిగా వైదొలుగుతాయని వాతావరణ విభాగం నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. ఒకవేళ ఈశాన్య గాలులు వీయడంతో రుతుపవనాలు వచ్చినట్టు ప్రకటించినా వర్షాలు ఉండవని నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. బంగాళాఖాతంలో అక్టోబరు 19 వరకు ఎటువంటి ఉపరితల ఆవర్తనాలు ఏర్పడే అవకాశం లేదంటున్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈనెల 20 లేదా 21వ తేదీన ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఉపరితల ఆవర్తనం వల్ల సముద్రం మీదుగా తేమగాలులు వచ్చి వర్షాలు కురుస్తాయని, అప్పటివరకు రాష్ట్రంలో ఎండలు, ఉక్కపోత ఉంటుందని పేర్కొన్నారు.


శ్రీపొట్టి శ్రీరాములు జిల్లాలో అత్యధికంగా దాదాపు 39 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగత్ర నమోదయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా, అల్లూరి సీతారామరాజు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 37 నుంచి 38 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. మరోవైపు, అరేబియా సముద్రంలో అక్టోబరు 20 తర్వాత రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మధ్య ట్రోపోస్పియరిక్‌లో ప్రస్తుతం పశ్చిమ గాలులు వీస్తున్నాయి. మధ్య పాకిస్థాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లోనూ ఆవర్తనాలు ఏర్పడుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఆగ్నేయానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియాలో ఎగువన ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, వచ్చే 24 గంటల్లో దీని ప్రభావంతో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అక్టోబర్ 17న ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa