ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలాత్రిపుర సుందరీదేవిగా కనకదుర్గమ్మ.. భక్తజన సంద్రంగా ఇంద్రకీలాద్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 06:06 PM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు స్వర్ణకవచాలంకృత బాలా త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్నపనాభిషేకం అనంతరం తొలిరోజు అమ్మవారి దర్శనం ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకూ దర్శనాలు కొనసాగనున్నాయి. బాలా త్రిపుర సుందరి దేవీ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీగా సందడి వాతావరణం నెలకుంది.


అమ్మవారి అవతారానికి సంబంధించి దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణఫలం అందించే దేవతగా బాలా త్రిపురసుందరీదేవిని కొలుస్తుంటారు. మనస్సు, చిత్తం, బుద్ధి, అహంకారం వంటివి బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షమాల ధరించిన అమ్మవారిని ఆరాధిస్తే మనో వికారాలు తొలగిపోవడంతో పాటు నిత్య సంతోషం కలుగుతుందని ప్రతీతి. ఈరోజు 2 నుంచి పదేళ్ల లోపు వయసున్న బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. వారికి పూజ చేసి కొత్త బట్టలు పెట్టాలి.


అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీబాలా మంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి చాలా గొప్పది.. ప్రధానమైనది. శ్రీవిద్యోపాసకులకు మొట్టమొదట అందుకే బాలామంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీదేవి కొలువైన పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే దేవత శ్రీబాలాత్రిపుర సుందరీదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితే మహాత్రిపుర సుందరీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. జగన్మాతయే ఆశ్వయుజ మాసంలో పలు అవతరాల్లో పూజలందుకుంటోంది. ప్రతిప్రాణిలో ఉండే శక్తే చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి. దీనినే నారాయణీ స్తుతి ‘త్వయైకయా పూరిత మంబయైతత్’ అంటూ ధృవపరిచింది. శివవిష్ణు సహస్ర నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసార ధ్యానిస్తే చాలు అపారమైన కరుణ లభిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa