ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నితీశ్ కుమార్‌ను రెండో గాంధీగా అభివర్ణిస్తూ ,,,,పాట్నాలో వెలిసిన పోస్టర్లు

national |  Suryaa Desk  | Published : Sun, Oct 15, 2023, 06:52 PM

బిహార్‌లో మరోసారి రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను మహాత్మా గాంధీతో పోల్చడమే తాజా వివాదానికి కారణం అయింది. బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ‘రెండో గాంధీ’ అంటూ ఉన్న పోస్టర్లు పాట్నాలో దర్శనం ఇవ్వడంతో ఈ వ్యవహారం బయటికి వచ్చింది. అయితే ఈ పోస్టర్లను నితీశ్ కుమార్‌కు చెందిన జనతా దళ్‌ యునైటెడ్‌ పార్టీకి చెందిన కొందరు నేతలు అంటించినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ పోస్టర్లపైనే బిహార్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఈ వివాదంపై నితీశ్ కుమార్‌కు మిత్రపక్షం, లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతా దళ్-ఆర్జేడీ నేతలు కూడా స్పందించారు. ఇక ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలు మాత్రం నితీశ్ కుమార్ పోస్టర్లపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.


పాట్నాలో వెలసిన పోస్టర్లలో నితీశ్ కుమార్‌ను మహాత్మా గాంధీతో పోల్చారు. సమానత్వ పాఠాన్ని నితీశ్‌ కుమార్ బోధించారని ఆ పోస్టర్లలో కొనియాడారు. బిహార్‌లో సామాజిక సంస్కరణలు తీసుకురావడానికి నితీశ్ కుమార్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ సూచించిన మార్గాన్ని నితీశ్ కుమార్ అనుసరిస్తున్నారని ఆ పోస్టర్లలో వ్యాఖ్యానించడం తాజాగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ పోస్టర్లపై జేడీయూ మిత్రపక్షమైన ఆర్జేడీ స్పందించింది. ఈ పోస్టర్లను నితీశ్‌ కుమార్‌ను ఆరాధించే భక్తులు అంటించి ఉంటారని.. ఆర్జేడీ నేత శివానంద్‌ తివారీ పేర్కొన్నారు. అయితే నితీశ్ కుమార్‌ను ఆయన పార్టీ నేతలు పొగడటంలో తప్పులేదని పేర్కొన్నారు. ఆ క్రమంలో మహాత్మా గాంధీని అవమానించడం సరైంది కాదని సున్నితంగా సూచించారు. మహాత్మా గాంధీ లాంటి వారు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పుడతారని రామ్ మనోహర్‌ లోహియా చెప్పిన విషయాన్ని శివానంద్ తివారీ గుర్తు చేశారు.


ఇక నితీశ్‌ కుమార్‌ను ‘రెండో గాంధీ’గా అభివర్ణిస్తూ పోస్టర్లు అంటించడంపై ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మహాత్ముడితో నితీశ్ కుమార్‌ను పోల్చడం కంటే దిగజారుడు చర్య మరొకటి ఉండదని.. బీజేపీ బిహార్ రాష్ట్ర అధికార ప్రతినిధి కుంతల్ కృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గత మూడు దశాబ్దాలుగా జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌.. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారని.. కానీ ప్రస్తుతం మాత్రం నితీశ్ కుమార్ ప్రధాని పీఠంపై కన్నేసి.. వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లోనే అత్యంత అవకాశవాద రాజకీయ నేత బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అని కుంతల్‌ కృష్ణ తీవ్ర విమర్శలు గుప్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa