విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ఆదివారం ఉదయం ఆరంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో జగన్మాత పది అవతారాల్లో దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శ్రీబాలాత్రిపుర సుందరీదేవి, రెండో రోజు గాయత్రీదేవి, మూడో రోజు అన్నపూర్ణాదేవి, నాలుగో రోజు మహాలక్ష్మీదేవి, ఐదో రోజు శ్రీమహాచండీదేవి, ఆరో రోజు జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఏడో రోజు లలితాత్రిపుర సుందరీదేవి, ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదో రోజున మాత్రం రెండు అలంకారాల్లో కనకదుర్గమ్మ దర్శనమివ్వనుండటం విశేషం. ఆ రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిగా, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. మరోవైపు, దసరాలో మొదటిసారిగా అమ్మవారి శ్రీ మహాచండి దేవి దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు.
దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. ఈ తొమ్మిది రోజుల్లో కనీసం 10 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి ఐదు రోజులు ఒక ఎత్తైతే.. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం అక్టోబరు 20 నుంచి కొండపై రద్దీ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ ఒక్క రోజే కనీసం 2 లక్షల మంది భక్తులు సరస్వతీదేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకుంటారు. మూలానక్షత్రం మరుసటి రోజు నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. ఆలయ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. కెనాల్ రోడ్డులోని వినాయకస్వామి ఆలయం వద్ద నుంచి క్యూలైన్ల ప్రారంభమవుతాయి. భక్తులంతా క్యూలైన్లలో కొండపైకి చేరుకున్నాక.. ఘాట్రోడ్డులో ఓంకారం మలుపు వద్ద నుంచి ఐదు లైన్లలో దర్శనానికి వెళ్తారు. రూ.100, రూ.300, రూ.500 (మూడు రకాలు) టిక్కెట్ దర్శనాలుంటాయి. ఇవికాకుండా రెండు ఉచిత దర్శన లైన్లు కూడా ఉన్నాయి. అయితే, ఈ పది రోజులు అంతరాలయం దర్శనం ఉండదని వెల్లడించారు.
భక్తులకు ప్రసాద విక్రయాల కోసం 12 కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొండ దిగువన అమ్మవారి దర్శించుకుని వచ్చే మార్గంలోని కనకదుర్గానగర్లో ఈ కౌంటర్లు ఉన్నాయి. లడ్డూ, పులిహోర, చక్రపొంగలి కౌంటర్లలో అందుబాటులో ఉంచుతున్నారు. వచ్చే భక్తులకు ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని విక్రయించేలా ముందస్తుగానే సన్నద్ధం చేసి ఉంచారు. పులిహోర, చక్రపొంగలి ఎప్పటికప్పుడు తయారు చేసి కౌంటర్లలో అందుబాటులో ఉంచనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa