ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆక్వా రైతులకు శుభవార్త చెప్పారు. నవంబర్ 1 నుంచి కొత్త కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ఆక్వా రైతుల సంక్షేమం కోసం సీఎం ఏర్పాటు చేసిన ఆక్వా సాధికారత కమిటీ సమావేశమైంది.. కీలక అంశాలపై చర్చించింది. సాధికారత కమిటీ కృషి ఫలితంగా ఇప్పటి వరకు 6 సార్లు ఆక్వా ఫీడ్, సీడ్ రేట్ల పెరుగుదలను నియంత్రించగలిగామని మంత్రులు అన్నారు. గతంలో ఫీడ్, సీడ్ రేట్లను నియంత్రించే విధానం లేకపోవడం వల్ల ఆక్వా రైతులు నష్టపోయే వారని, రాష్ట్రంలో ఇప్పుడా పరిస్థితి లేదని తెలిపారు.
ఆక్వా జోన్ పరిధిలో 4.65 లక్షల ఎకరాలు సాగవుతుండగా, దాంట్లో విద్యుత్ సబ్సిడీకి అర్హత పొందిన (10 ఎకరాల్లోపు ) విస్తీర్ణం 3.26 లక్షల ఎకరాలుగా గుర్తించామన్నారు. తొలుత ఈ–ఫిష్ సర్వే ద్వారా 46,433 ఆక్వా విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు అండగా నిలవాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రైతుల దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మరో 4,230 కనెక్షన్లకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా అర్హత పొందిన వారికి నవంబర్ 1 నుంచి సబ్సిడీ విద్యుత్ అందించాలని డిస్కంలను మంత్రులు ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో వంద కౌంట్ రొయ్యలకు కిలో రూ. 240గా రేటు ఖరారు చేశామని.. ఇంతకన్నా తక్కువకు కొనడానికి వీల్లేదని ఆక్వా సాధికారత కమిటీ తెలిపింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకంటే తక్కువకు కొనే వారిపై ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక వినియోగం పెంచాలన్న సంకల్పంతో ఫిష్ ఆంధ్రా అవుట్లెట్స్ను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్లు మంత్రులు చెప్పారు. ఫలితంగా ప్రతి నెలా స్థానిక వినియోగం వెయ్యి టన్నులకు పెరిగిందన్నారు. రాబోయే రోజుల్లో ఫిష్ ఆంధ్రా ద్వారా వినియోగం మరింత పెంచాలని చెప్పారు. అప్సడా ద్వారా 10 రోజులకోసారి రొయ్య రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ ధరల స్థిరీకరణకు కృషి చేస్తున్నట్లు అప్సడా కో వైస్ చైర్మన్ వడ్డి రఘురాం అన్నారు. రాష్ట్రంలో రొయ్య రైతులందరితో కొత్తగా ఏర్పాటు చేసిన సమాఖ్యకు ఇటీవలే తాడేపల్లిలో కార్యాలయాన్ని కూడా ప్రారంభించామన్నారు. నగరాలు, ప్రధాన పట్టణాల్లో ప్రాన్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ స్థానిక వినియోగాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. ఆక్వా హబ్ ల ద్వారా స్థానిక మార్కెట్ లో వినియోగంను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలి అని సాధికారిత కమిటీ సభ్యులు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa