విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం దుర్గమ్మ శ్రీమహాలక్ష్మీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మీదేవి.. జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయడం ఒక అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒకటైన శ్రీమహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమష్టి రూపమైన అమృత స్వరూపిణి. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయనేది భక్తుల నమ్మకం. అష్టలక్ష్మిల్లో ఒకరైన మహాలక్ష్మిని దర్శనం చేసుకునేందుకు భక్తులు ఇష్టపడతారు. భక్తులకు బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయంలో విశేష పూజలు, కుంకుమార్చనలకు భక్తులు భారీగా తరలివచ్చారు.గత నాలుగు రోజులుగా ఇంద్ర కీలాద్రిపై భక్తుల రద్దీ కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనానికి ప్రముఖులు వస్తుండటంతో ఆలయ పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లను సీపీ స్వయంగా పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అందరికి అమ్మ వారి దర్శనం పూర్తయ్యేలా చూస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa