ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరం సమీపంలో చిరుత అనుమానాస్పద మృతి,,,,రైలు పట్టాలపై మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 18, 2023, 07:09 PM

శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుతపులి మృతి కలకలం రేపింది. ధర్మవరం నియోజకవర్గంలో బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి సమీపంలో రైలు పట్టాలపై చిరుత పులి చనిపోయి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ చిరుత బుధవారం తెల్లవారుజామున డి.చెర్లోపల్లి గ్రామంలోకి ప్రవేశించే క్రమంలో ట్రాక్ దాటుతూ రైలు కింద పడి చనిపోయి ఉండొచ్చని అధికారులు ముందుగా భావించారు.


కానీ చిరుతను క్షుణ్ణంగా పరిశీలిస్తే గోళ్లు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వేటగాళ్లు చిరుతను ఎక్కడో చంపేసి గోళ్లు తొలగించి రైలు పట్టాలపై పడేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో చుట్టు పక్కల ఉన్న జనాల్ని అడిగి వివరాలు సేకరిస్తున్నారు. ఆగస్టులో కూడా పొరుగున ఉన్న అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలో చిరుతలు ఇలాగే అనుమానాస్పద రీతిలో చనిపోయాయి. కాకులకొండ పక్కన పొలాల్లో చిరుతలు అనుమానాస్పదంగా పడి ఉన్నాయి. చిరుతల నోటిలో నుంచి నురుగ రావడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చిరుతల ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో.. విష ప్రయోగం జరిగిందనే అనుమానాలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ధర్మవరం సమీపంలో చిరుత అనుమానాస్పద రీతిలో మృతి చెందడం సంచలనం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa