అనంతపురం జిల్లాలో గుండెల్ని మెలిపెట్టే ఘటన చోటుచేసుకుంది. విష జ్వరం కారణంగా ఐదేళ్ల బాలుడు మృతి చెందగా.. అంబులెన్సులు అందుబాటులేక చిన్నారి మృతదేహాన్ని బైక్ మీద ఇంటికి తరలించారు. ఈ సన్నివేశం చూసిన స్థానికుల హృదయాలు ద్రవించిపోయాయి. మడకశిర అమరాపురం మండల పరిధిలోని హనుమంతనపల్లి గ్రామంలో నివసిస్తున్న రాధమ్మ, లింగప్ప దంపతులకు ఐదేళ్ల కుమారుడు రుషి ఉన్నాడు. కాగా.. చిన్నారి రుషికి విష జ్వరం వచ్చింది. ప్రైవేటు ఆస్పత్రిలో చూపించే స్థోమత లేక.. మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందించినా.. ఆ బాలున్ని మృత్యువు నుంచి కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూనే ఆ చిన్నారి తుది శ్వాస విడిచాడు. ఐదేళ్లు గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ఆ చిన్నారి గుండె ఆగిపోయిందని తెలిసి.. తల్లిందండ్రులు గుండెలవిసేలా రోధించారు. కాగా.. ఆ చిన్నారి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. కానీ.. ఆ ఆస్పత్రిలో చిన్నారిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్ అందుబాటులో లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లాలంటే అంత డబ్బు లేదు. దీంతో.. గుండెల నిండా దుఖంతో ఆ చిన్నారి మృతదేహాన్ని ఓ ద్విచక్రవాహనంపైనే తీసుకెళ్లాల్సి వచ్చింది.
చిన్నారి రుషి మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తరలిస్తున్న సన్నివేశాన్ని చూసిన స్థానికులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మడకశిర నియోజకవర్గంలో మానవత్వం అనేది మంట కలిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందితే ఆ మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ లేకపోవటం.. దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు విష జ్వరంతో నలుగురు వరకు మృతి చెందినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa