పల్నాడు జిల్లాలో విషాద ఘటన జరిగింది. భార్య ప్రసవించిన ఆస్పత్రికి భర్త మృతదేహం తీసుకురావడం కన్నీళ్లు పెట్టిస్తోంది. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. శుక్రవారం రాత్రి 10 గంటలకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవని గురజాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లమని వైద్యులు సూచించారు. దీంతో రాత్రి 11 గంటలకు గురజాల ఆస్పత్రికి వెళ్లారు. ఇక్కడ కూడా వైద్య సదుపాయాలు సరిగా లేవని 70 కి.మీ. దూరంలో ఉన్న నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి వెళ్లమని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే నర్సరావుపేట ఆస్పత్రి వద్దకు చేరగానే రామాంజిని ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ క్రమంలో కారంపూడి నుంచి గురజాల వరకు తోడుగా వచ్చిన ఆమె భర్త ఆనంద్ ఇంటికి వెళ్లి డబ్బులు తెస్తానని బయలుదేరాడు. బైక్పై ఇంటికి వెళ్లి తిరిగొస్తూ.. మార్గమధ్యంలో జోలకల్లు వద్ద రహదారిపై ఉన్న పెద్ద గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించి స్థానికులు ఆనంద్ను నరసరావుపేటకు తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరగానే ఆనంద్.. బిడ్డను చూడకముందుకే కన్నుమూశారు. ఆనంద్ విగత జీవుడిగా కనిపించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రామాంజిని పాపను ప్రసవించిన కొద్దిసేపటికి నరసరావుపేట ఆసుపత్రికి భర్త మృతదేహం వచ్చి చేరింది. దీంతో ఆ మహిళకు పాప పుట్టిందన్న సంతోషం ఎక్కవ సేపు నిలవలేదు. భర్త మరణవార్త తెలిసి రామాంజిని కన్నీరుమున్నీరుగా విలపించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa