ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి.. వచ్చే నెల నుంచి పక్కా, తక్కువ ధరకే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 27, 2023, 06:28 PM

ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా కార్డులు ఉన్నవారికి కందిపప్పు పంపిణీ చేయనుంది. నవంబర్ నుంచి క్రమం తప్పకుండా లబ్దిదారులకు కిలో చొప్పున కందిపప్పు అందించనుంది. తాజాగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 10 వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు హైదరాబాద్‌ అగ్రికల్చరల్‌ కో–ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే హాకా దగ్గర కూడా తగినంత నిల్వలు లేకపోవడంతో 7,200 టన్నుల సరఫరాకు ఓకే చెప్పింది.


ముందుగా తొలి దశలో 3,660 టన్నులు, రెండో దశలో 3,540 టన్నులు అందించనున్నారు. వచ్చే నెల అవసరాల కోసం 2,300 టన్నుల సరఫరాకు సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా చూస్తే పప్పు ధాన్యాల కొరతతో ధరలు భారీగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పంట ఉత్పత్తులు బహిరంగ మార్కెట్‌కు వెళ్లిపోవడంతో ఎఫ్‌సీఐ దగ్గర కూడా నిల్వలు లేవు.. దీంతో కందిపప్పు పంపిణీకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో కందిపప్పు రకాన్ని బట్టి రూ.150 నుంచి రూ.180 వరకు నడుస్తోంది.


అయితే రూ.67కు ప్రభుత్వం కిలో కందిపప్పును రేషన్ కార్డులు ఉన్నవారికి ఇవ్వనుంది. అంటే దాదాపు సబ్సిడీ రూపంలో ప్రభుత్వం రూ.70పైగానే భరిస్తున్నట్టు లెక్క. ఈ నెలాఖరు నాటికి చౌక ధరల దుకాణాల దగ్గర అందుబాటులో ఉన్న నిల్వల ప్రకారం సరుకును తరలించనున్నారు. నవంబర్ మాత్రమే కాదు.. డిసెంబర్, జనవరిల్ కూడా సబ్సిడీ కందిపప్పును ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ ప్రభుత్వం 50వేల టన్నుల కందిపప్పు కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. కర్ణాటకలోని బఫర్‌ స్టాక్‌ నుంచి 9,764 టన్నులు కందులు కేటాయించగా వాటిలో నాణ్యత లేదు. మళ్లీ రెండుసార్లు ప్రతిపాదనలు పంపినా స్పందన లేదు.


ఇటీవల కేంద్ంర హాకా నుంచి కందిపప్పును తీసుకోవాలని సూచించింది.దీంతో వచ్చే మూడు నెలలకు హాకా సరఫరా చేసే కందిపప్పును రాష్ట్ర ప్రభుత్వం కార్టులు ఉన్నవారికి పంపిణీ చేయనుంది.అంతేకాదు రాబోయే రోజుల్లో కందిపప్పు విషయంలో ఇబ్బందు లేకుండా.. పౌరసరఫరాల సంస్థ ద్వారా నేరుగా రైతుల నుంచి మార్కెట్‌ ధరకు ప్రభుత్వం కందులు సేకరించనుంది. తొలుత ఈ ఖరీఫ్‌లో 30 వేల టన్నులు సేకరించాలని భావిస్తున్నారు.. వీటిని ప్రాసెస్ చేసి సబ్సిడీపై కార్డుదారులకు అందించనున్నారు.


రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు ప్రతి నెలా నిరంతరాయంగా కందిపప్పు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టారు. హాకా ద్వా­రా కందిపప్పును సేకరిస్తున్నారు.. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. ఈ నెలాఖరు నాటికి ఎఫ్‌పీ దుకాణాలకు సరుకు చేర్చేలా ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్, జనవరిల్లో వంద శాతం కార్డులకు పంపిణీ చేస్తామంటోంది ప్రభుత్వం. ఈ ఖరీఫ్‌లో రైతుల నుంచి కందులు కొనుగోలు చేయనున్నారు. రైతుల నుంచి మార్కెట్‌ ధరకు కందులు కొనుగోలు చేసి వాటిని రాష్ట్ర వినియోగానికి వాడుకుంటే.. రైతులకు, లబ్దిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa