ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తతో భార్యకు గొడవ.... 5 రోజుల తర్వాత షాకింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 06:08 PM

విశాఖలో దారుణం జరిగింది. ఇంట్లో భర్తతో గొడవపడిన భార్య బయటకు వెళ్లిపోయింది. ఐదు రోజుల తర్వాత చిన్న కుమారుడి మృతదేహం నీటి సంపులో బయటపడటం కలకలంరేపింది. విజయనగరం జిల్లా ఎస్‌.కోట ప్రాంతానికి చెందిన డి.దొరబాబు, మణి దంపతులు 8 నెలల క్రితం గాజువాకలోని ఓ అపార్టుమెంట్‌లో వాచ్‌మన్‌ పనికి కుదిరారు. వీరికి ఎనిమిదేళ్ల శంకర్‌, ఐదేళ్ల వేదాంత్‌ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.


ఈ క్రమంలో ఈ నెల 24న మళ్లీ గొడవ జరగడంతో మణి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఇంతలో చిన్న కుమారుడు వేదాంత్‌ ఆమె వెంట పడ్డాడు. పెద్ద కుమారుడు శంకర్‌ తండ్రి వద్దే ఉండిపోయాడు. ఆ తర్వాత శనివారం ఉదయం నీటి సంప్‌ నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అపార్ట్‌మెంట్‌లో ఉండేవాళ్లు వెళ్లిచూశారు. సంప్‌లో వేదాంత్‌ మృతదేహం ఉబ్బిపోయి నీటిపై తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.


బాలుడి తండ్రి దొరబాబును ఈ ఘటనపై ప్రశ్నించగా.. గొడవ పడినరోజు తన భార్యే చిన్న కుమారుడిని తీసుకెళ్లిందనుకున్నానని చెప్పడంతో అవాక్కయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. బాలుడు తన తల్లితో కలిసి సెల్లార్‌లో తిరిగినట్టు, ఆమె తన కుమారుడిని సంప్‌ వద్దకు తీసుకెళ్లినట్టు, ఆ తర్వాత ఒంటరిగా బయటకు వెళ్లిపోయినట్టు దృశ్యాలు ఉన్నాయి. దీంతో తల్లే తన బిడ్డను హతమార్చినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.


భర్త దొరబాబు ఫిర్యాదుతో భార్యపై కేసు నమోదు చేశారు. నిందితురాలి మొబైల్‌ లొకేషన్‌ పరిశీలించగా... తొలుత చెన్నై, తర్వాత హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ నిమిత్తం ఆమెను విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. బాలుడి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కుమారుడి మరణంతో తండ్రి దొరబాబు తీవ్ర విషాదంలో ఉన్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa