ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీ డైరీలు, క్యాలెండర్లు ,,,,ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 29, 2023, 06:33 PM

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. టీటీడీ ముద్రించిన 2024వ సంవ‌త్స‌రం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్త‌క విక్ర‌య‌శాల‌ల్లో భ‌క్తులు కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, టీటీడీ వెబ్‌సైట్ www.ttdevasthanams.ap.gov.in ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భ‌క్తులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. 12 పేజీల క్యాలెండర్ – రూ.130/-, డైరీ(డీలక్స్) రూ.150/-, డైరీ(చిన్న) రూ.120/-, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75/-, 6 పేజీల క్యాలెండర్ రూ.450/-, శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20/-, శ్రీ‌వారి, శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి క్యాలెండర్ రూ.15/-, శ్రీ ప‌ద్మావ‌తి పెద్ద క్యాలెండర్ రూ.20/-, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30/-లుగా నిర్ణయించింది టీటీడీ.


చెన్నైలోని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీ‌వారి ఆల‌యాలు, ముంబ‌యి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణమండపాల్లో క్యాలెండర్లు, డైరీలు విక్రయాల కోసం అందుబాటులో ఉన్నాయి. అవసరమైన భక్తులు కొనుగోలు చేయొచ్చని టీటీడీ తెలిపింది. బుకింగ్ వెబ్‌సైట్: https://ttdevasthanams.ap.gov.in/> ప్రచురణలు > డైరీలు/ క్యాలెండర్లు/ పంచాంగాలను బుక్ చేసుకోవచ్చు. అవసరమైన భక్తులు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. లింక్ కోసం క్లిక్ చేయండి.


తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అన్నాభిషేకం వైభ‌వంగా జ‌రిగింది. ఈ సందర్భంగా ఉదయం ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. మ‌ధ్యాహ్నం భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఆ త‌రువాత ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టి భ‌క్తుల‌కు పంపిణీ చేశారు. శుద్ధి అనంతరం సాయంత్రం సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా సాయంత్రం 6.45 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసి వేశారు.. ఆదివారం ఉద‌యం 4 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు తెరిచారు. శుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నంకు అనుమతించారు.


ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్ శ‌నివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, శ్రీ‌వారి చిత్ర‌ప‌టం అందించారు. అదేవిధంగా, తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకున్న‌ జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్‌కు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa